
రవ్వ ఉండ్రాళ్లకు తయారీకి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు పావు కప్పు, బియ్యం రవ్వ: రెండు కప్పులు, నీళ్లు: ఆరు కప్పులు, ఉప్పు: రుచికి సరిపడా, జీలకర్ర: ఒక టీ స్పూన్, ఇంగువ: పావు టీ స్పూన్, నెయ్యి: ఒకటి లేదా రెండు టీ స్పూన్లు , పచ్చి కొబ్బరి తురుము, రెండు టేబుల్ స్పూన్లు ఇవి ఉంటే చాలు ఇంట్లోనే ఈజీగా ఈ రవ్వ ఉండ్రాళ్లు చేసుకోవచ్చు.

ముందుగా ఒక గిన్నెలో పావు కప్పు శనగపప్పు తీసుకుని, రెండుసార్లు శుభ్రంగా కడిగి, మళ్లీ నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టాలి. తర్వాత రెండు కప్పుల బియ్యం రవ్వను మిక్సీ జార్లో వేసి, పల్స్ మోడ్లో కొద్దిసేపు గ్రైండ్ చేయండి.ఒకవేళ బియ్యం రవ్వ దొరకకపోతే, ఇంట్లో వాడే బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తడి లేకుండా ఫ్యాన్ గాలికి ఆరబెట్టి, మిక్సీలో సన్నని రవ్వలాగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ పిండిని జల్లించకుండా నేరుగా వాడండి

ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని, గ్రైండ్ చేసుకున్న బియ్యం రవ్వను వేసి దోరగా వేయించండి. రంగు మారకుండా, కేవలం వెచ్చగా అయితే సరిపోతుంది. వేయించిన రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి రవ్వ క్వాంటిటీకి తగ్గట్టుగా నీళ్లు పోయాలి. ఒక కప్పు రవ్వకు మూడు కప్పుల నీళ్ల చొప్పున, రెండు కప్పుల రవ్వకు ఆరు కప్పుల నీళ్లు పోయండి. రుచికి తగినంత ఉప్పు వేసి, మూత పెట్టి నీళ్లు బాగా తెర్లకాగేంతవరకు మరిగించండి.

నీళ్లు మరుగుతున్నప్పుడు, నానబెట్టిన శనగపప్పు నుండి నీళ్లను తీసేసి, మరుగుతున్న నీళ్లలో వేయండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించండి. పప్పు కొద్దిగా పలుకుగా ఉడికితే సరిపోతుంది. ఉడికిన శనగపప్పులోకి జీలకర్ర, ఇంగువ, పచ్చి కొబ్బరి తురుము వేసి ఒక్కసారి కలపండి. ఇప్పుడు మంటను తగ్గించి, వేయించి పక్కన పెట్టుకున్న రవ్వను కొద్దికొద్దిగా వేసుకుంటూ గరిటతో ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.

ఇందులోనే నెయ్యి కూడా వేసి మొత్తం కలిసేలా చేయండి. మిశ్రమం దగ్గరపడిన తర్వాత, మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేయండి. రవ్వలో ఉన్న నీళ్లన్నీ ఎగిరిపోయి, రవ్వ చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేయండి. గరిటతో కలుపుతూ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారనివ్వకుండా, కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేతిని నీటిలో తడుపుకుంటూ ఉండ్రాళ్ల ఆకారంలో చుట్టుకోండి. వీటిని రౌండ్గా లేదా కుడుముల్లా కూడా చేసుకోవచ్చు. ఈ క్వాంటిటీకి సుమారు 30 నుండి 35 ఉండ్రాళ్లు వస్తాయి.

ఇడ్లీ స్టీమర్ను స్టవ్ మీద పెట్టి, నీళ్లు పోసి ఆవిరి వచ్చేంతవరకు మరిగించండి. ఈలోపు ఒక ప్లేట్కు నెయ్యి లేదా నూనె రాసి, దానిపై చుట్టుకున్న ఉండ్రాళ్లను అమర్చండి. ఆవిరి వస్తున్నప్పుడు, ఈ ప్లేట్ను స్టీమర్లో పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. పది నిమిషాల తర్వాత ఉండ్రాళ్లు చక్కగా ఉడికిపోయి ఉంటాయి. స్టవ్ ఆపి, స్టీమర్ నుండి బయటకు తీసి, కొద్దిగా చల్లారిన తర్వాత గణనాథునికి నైవేద్యంగా సమర్పించండి!