
బరువు తగ్గడం, డయాబెటిస్ వంటి పలు ఆరోగ్య సమస్య కారణంగా చాలా మంది రాత్రిళ్లు చపాతీ తినడానికి ఇష్టపడుతుంటారు. రాత్రిపూట తేలికైన భోజనం తనిడం వల్ల జీర్ణవ్యవస్థ, బరువుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. పగటిపూట కంటే రాత్రిపూట శారీరకంగా తక్కువగా చురుగ్గా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మందగిస్తుంది.

అందువల్ల రాత్రిపూట చపాతీలు ఎక్కువగా తింటే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. శరీర కొవ్వు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉండటానికి పరిమితంగా, తేలికైన విందు తీసుకోవడం ఎల్లప్పుడూ ప్రయోజనకరం. రాత్రిపూట సాధారణంగా పురుషులకు మహిళల కంటే ఎక్కువ శారీరక శ్రమ, కేలరీల అవసరం ఉంటాయి. అయితే రాత్రిపూట ఎక్కువ కార్బోహైడ్రేట్లు తీసుకోకుండా ఉండాలి. ఆరోగ్యకరమైన వారు రాత్రి భోజనంలో 2 నుంచి 3 చపాతీలు తింటే సరిపోతుంది.

అధిక బరువుతో ఉంటే లేదా బరువు తగ్గాలనుకుంటే 2 చపాతీలు, వాటితో పాటు ఎక్కువ మొత్తంలో కూరగాయలు, పప్పులు తీసుకోవాలి. మహిళలకు పురుషుల కంటే జీవక్రియ కొంచెం నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి వారు రాత్రి భోజనంలో కేలరీల తీసుకోవడం నియంత్రించుకోవాలి.

మహిళలు రాత్రిపూట 1 నుంచి 2 చపాతీలు తినడం మంచిదని భావిస్తారు. శారీరక శ్రమ తక్కువగా ఉంటే 1 చపాతీ, దానితో పాటు ఒక గిన్నె సూప్ లేదా సలాడ్ తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చపాతీలపై మాత్రమే ఆధారపడకుండా ప్రోటీన్ల పరిమాణాన్ని ఆహారంలో పెంచాలి. పప్పు, ఉసల్, పన్నీర్ వంటి ఆహారాలను చేర్చుకోవడం మంచిది. పడుకునే ముందు కనీసం 2 నుంచి 3 గంటల ముందు రాత్రి భోజనం చేయాలి. ఇది ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. బరువు పెరగకుండా నిరోధిస్తుంది.

వీలైతే గోధుమ చపాతీకి బదులుగా జొన్నలు, మిల్లెట్ చపాతీ తినడం మంచిది. ఎందుకంటే ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగడం మానుకోవాలి. భోజనం చేసిన అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది.