చేపల వేటకు వెళ్లిన మత్య్సకారులకు వింత.. వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. ఒకసారి.. కొండ చిలువలు, మరికొన్ని మొసళ్లు ఇలా ఏవేవో జంతువులతో పాటు వస్తువులు కూడా వలలో చిక్కుకున్న సందర్భాలున్నాయి. అయితే, తాజాగా.. ఓ జాలరికి అనుకోకుండా అదృష్టం దరిచేరింది. అరుదైన చేప వలకు చిక్కడంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఉడిపిలోని మల్పే బీచ్లో అరుదైన బంగారు రంగు చేప మత్స్యకారుల వలలో పడింది. అంజాల్ చేప బంగారు రంగులో ఉంటుంది. ఇది సుమారు 16 కిలోల బరువు ఉంది. బోటులో చేపల వేటకు వెళ్లిన సందర్భంలో ఈ చేప వలలో చిక్కుకున్నట్లు జాలరీ తెలిపాడు.
మల్పే ఓడరేవులో బంగారు రంగు అంజల్ చేప కిలోకు 600 రూపాయలుగా విక్రయించారు. అయితే.. బంగారు చేప దొరికిందన్న సమాచారం అందుకున్న స్థానికులు చేపను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారు. దీంతోపాటు ఆ చేపను దక్కించుకునేందుకు పోటీ కూడా పడ్డారు.
అట్లాంటిక్ సరస్సులలో ఒక ప్రత్యేక ఏంజెల్ ఫిష్ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ, ఇప్పుడు కర్నాటక మత్స్యకారుల వలలో ఈ ప్రత్యేక చేప పడటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
చివరకు.. మల్పేకు చెందిన సురేష్ ఈ చేపను మొత్తం రూ.9,600కు కొనుగోలు చేశాడు. ఒక్క చేప అమ్మగా రూ.పదివేలు వచ్చినట్లు మత్స్యకారులు తెలిపారు.
అరేబియా సముద్రానికి చెందిన అంజల్ చేపలకు సహజసిద్ధమైన లక్షణాలు లేదా జన్యుపరంగా బంగారు రంగు వచ్చే అవకాశం ఉందని పరిశోధకురాలు డా.తజ్జా తెలిపారు.
కాగా.. ఈ చేప వలకు చిక్కడం, దాన్ని కొనేందుకు పోటీపడటంతో మార్కెట్లో సందడి నెలకొందని జాలర్లు వెల్లడించారు.