
సిట్రస్ పండ్లతో ఎసిడిటీ ముప్పు: నారింజ, బత్తాయి, పైనాపిల్, ద్రాక్ష వంటి సిట్రస్ జాతి పండ్లలో సహజ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఖాళీ కడుపుతో అస్సలు తీసుకోకూడదు. పరగడుపున ఇవి తినడం వల్ల కడుపులోని లోపలి పొరలు ప్రభావితమై.. తీవ్రమైన అసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ సమస్యలకు దారితీస్తుంది. ఇప్పటికే జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇవి మరింత హాని చేస్తాయి. అందుకే సిట్రస్ పండ్లను ఎల్లప్పుడూ తేలికపాటి అల్పాహారం తిన్న తర్వాతే తీసుకోవడం ఉత్తమం.

అరటిపండు మంచిదేనా: తక్షణ శక్తి కోసం చాలా మంది ఉదయాన్నే అరటిపండు తింటుంటారు. కానీ ఖాళీ కడుపుతో అరటిపండు తినడం అందరికీ సెట్ కాదు. దీనిలోని సహజ చక్కెరలు, మెగ్నీషియం స్థాయిలు కొంతమందిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ను వేగంగా పెంచుతాయి. అంతేకాకుండా పరగడుపున ఇది తినడం వల్ల కొందరిలో కడుపు బరువుగా అనిపించడం, నీరసం రావడం వంటివి జరుగుతాయి. ఒకవేళ అరటిపండు తినాలనుకుంటే... డ్రై ఫ్రూట్స్, ఓట్స్ లేదా ఇతర బ్రేక్ఫాస్ట్ పదార్థాలతో కలిపి తీసుకోవడం మంచిది.

వేసవి పండ్లతో జాగ్రత్త: ప్రస్తుతం వేసవి కాలం కావడంతో పుచ్చకాయ, కర్బూజా వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను ఉదయాన్నే తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే వీటిని ఖాళీ కడుపుతో అతిగా తింటే కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు వీటిని పరిమితంగానే తినాలి. అలాగే వీటిని ఇతర బరువైన ఆహారాలతో కలిపి తీసుకోకూడదు.

బ్లడ్ షుగర్ పెంచే అతి తీపి పండ్లు: మామిడి, సపోటా, ద్రాక్ష వంటి పండ్లలో సహజ చక్కెర చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని ఉదయాన్నే పరగడుపున తింటే రక్తంలో చక్కెర స్థాయిలు రాకెట్ వేగంతో దూసుకెళ్తాయి. ముఖ్యంగా మధుమేహం, ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారు ఈ పండ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

మరి ఉదయాన్నే ఏ పండ్లు తినాలి: ఉదయం పూట ఖాళీ కడుపుతో తేలికగా, సులభంగా జీర్ణమయ్యే పండ్లను ఎంచుకోవాలి. బొప్పాయి, ఆపిల్ వంటివి పరగడుపున తినడానికి అద్భుతమైన ఎంపికలు. రాత్రి నానబెట్టిన బాదం, ఎండు ద్రాక్ష వంటి ఎండు ఫలాలు తినడం వల్ల శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఉదయాన్నే నిద్ర లేవగానే మొదట ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు త్రాగి... ఆ తర్వాతే పండ్లు తినడం జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది.