
భారతీయ సంప్రదాయంలో పక్షులకు ఆహారం వేయడం అనేది ఒక పుణ్యకార్యంగా భావిస్తారు. ముఖ్యంగా పావురాలకు సజ్జలు (Bajra) వేయడం వెనుక లోతైన జ్యోతిష్య కారణాలు ఉన్నాయి. వేద జ్యోతిష్యం ప్రకారం ప్రతి ప్రాణి ఒక గ్రహం శక్తిని కలిగి ఉంటుంది. పావురాలు ప్రధానంగా శుక్ర గ్రహానికి, చంద్రునికి సంబంధం కలిగి ఉంటాయి.

శుక్రుడు (Venus) ప్రేమ, విలాసం,ఆర్థిక ఐశ్వర్యానికి కారకుడు. శుక్రుడి అనుగ్రహం కోసం పావురాలకు ఆహారం వేయడం మంచిది. చంద్రుడు (Moon) మనస్సు, భావోద్వేగాలకు కారకుడు. పావురాలకు సజ్జలు వేయడం వల్ల మానసిక ఆందోళనలు తగ్గి ప్రశాంతత లభిస్తుంది.

సజ్జలు సహజమైనవి. భూమి సారాన్ని కలిగి ఉంటాయి. ఇవి శుక్రుడితో పాటు శని గ్రహం క్రమశిక్షణను కూడా సమతుల్యం చేస్తాయి. సంబంధాలలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు లేదా ఆర్థికంగా ఇబ్బందులు పడే వారు ప్రతిరోజూ ఉదయం పావురాలకు సజ్జలు వేయడం వల్ల సానుకూల మార్పులను గమనించవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

పక్షులకు ఆహారం వేయడం అనేది ప్రతిఫలం ఆశించని నిస్వార్థమైన పని. ఇటువంటి పనులు చేయడం వల్ల మన గత జన్మల కర్మల ప్రభావం తగ్గి, జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. పావురాలు శాంతికి చిహ్నాలు కాబట్టి, వాటిని పోషించడం వల్ల ఇంట్లో, సమాజంలో శాంతి నెలకొంటుంది.

ఎలా వేయాలి? ఇందుకు తగిన నియమాల విషయానికి వస్తే.. సూర్యోదయ సమయంలో పావురాలకు ఆహారం వేయడం అత్యంత ఉత్తమం. బహిరంగ ప్రదేశాల్లో, పార్కుల్లో లేదా ఇంటి పైకప్పు మీద పావురాలు గుమిగూడే చోట వేయాలి. ఇది ఒక మొక్కుబడిగా కాకుండా, ప్రకృతి పట్ల కృతజ్ఞతా భావంతో చేయాలి.