
డ్రైప్రూట్స్ అనేవి మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందించే సూపర్ ఫుడ్స్. చాలా మంది జిమ్కు వెల్లేవారు, ప్రోటీన్ కావాలి అనుకునే వారు ఎక్కవగా వీటిని తీసుకుంటారు. ముఖ్యంగా బాదం, జీడిపప్పు, వాల్నట్స్, ఖర్జూరం మొదలైన వాటిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, వీటిని సరిగ్గా తీసుకోకపోతే, శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాబట్టి డ్రై ఫ్రూట్స్ ను ఏ టైంలో తినాలి, ఎలా తినాలో ఇక్కడ చూద్దాం.

డ్రై ఫ్రూట్స్ ఎలా తినాలి?: ఆయుర్వేదం ప్రకారం.. డ్రై ఫ్రూట్స్ ను ఉదయాన్నే నేరుగా తినడం కన్నా.. వాటిని రాత్రంతా నీటిలో నానబెట్టి మార్నింగ్ తినడమే ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా నీటిలో నానబెట్టడం ద్వారా వాటిలో ఉండే ఫైటిక్ యాసిడ్ తగ్గుతుందని, అలాగే పోషకాలు సులభంగా గ్రహించడానికి, శరీర ఉష్ణోగ్రత పెరిగే అవకాశం కూడా తగ్గుతుందని చెబుతున్నారు. అలాగే రోజుకు కేవలం 20–30 గ్రాములు మాత్రమే తీసుకోవాలని.. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని నేరుగా తినడం మంచిది కాదని సూచిస్తున్నారు.

అధిక ఉష్ణ గుణాలున్న డ్రై ఫ్రూట్స్: ఎండిన ఖర్జూరాలు, వాల్నట్లు, నానబెట్టని బాదం, పిస్తాలు వంటి డ్రై ఫ్రూట్స్ను నేరుగా తినడం వల్ల బాడీలో టెంపరేచర్ పెరుగుతుంది. కాబట్టి వీటిని మితంగా తీసుకోవడం, వీలైనంత వరకు నానబెట్టడం తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పి, మొటిమలు లేదా అజీర్ణం వంటి సమస్యలు రావచ్చని హెచ్చరిస్తున్నారు.

అలాగే నానబెట్టిన బాదం, ఎండుద్రాక్ష, నానబెట్టిన జీడిపప్పు, ఖర్జూరాలను మితంగా తీసుకోవాలని చెబుతున్నారు. డ్రై ఫ్రూట్స్ తినడం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని.. కానీ వాటి పూర్తి ప్రయోజనాలను సురక్షితంగా పొందాలంటే, వాటిని సరైన పద్ధతిలో, కాలాన్ని బట్టి మితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గమనిక: మధుమేహం,అధిక బరువు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తమ డాక్టర్ లేదా పోషకాహార నిపుణుల సలహా మేరకు వీటిని తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆదారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు.