
ప్రసవం తర్వాత బాలింతల కోసం కరివేపాకు కారం పొడి ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇది నోటికి రుచిని మాత్రమేకాదు ఒంటికి శక్తిని ఇస్తుంది. దీని తయారీకి కావలసిన పదార్థాలు.. కరివేపాకు 4 కప్పులు (శుభ్రంగా కడిగి పూర్తిగా ఆరబెట్టినవి), ఎండు మిరపకాయలు – 20 నుండి 25, ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర – 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 10 నుండి 15, ఉప్పు – తగినంత, నూనె 1 టీ స్పూన్ (ఐచ్ఛికం) తీసుకోవాలి.

ముందుగా కరివేపాకును బాగా కడగాలి. నీరు పూర్తిగా ఆరిపోయే వరకు గుడ్డపై లేదా జల్లెడలో పరచాలి. తడి ఉంటే పొడి త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మందపాటి కళాయిలో కరివేపాకు వేసి తక్కువ మంటపై వేయించాలి. ఆకులు పూర్తిగా కరకరలాడే వరకు వేయించాలి. మాడిపోకుండా తరచూ కలుపుతూ ఉండాలి. వేయించిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి.

అదే పాన్లో ధనియాలు వేయించి సువాసన వచ్చే వరకు వేయించాలి. తరువాత జీలకర్రను స్వల్పంగా వేయించాలి. ఎండు మిరపకాయలను కొద్దిగా నూనె వేసి వేయిస్తే మంచి రుచి వస్తుంది. వెల్లుల్లి రెబ్బలను కూడా స్వల్పంగా వేయించుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా ఎండు మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు వేసి పొడిచేయాలి. తరువాత వేయించిన కరివేపాకు, వెల్లుల్లి వేసి మళ్లీ గ్రైండ్ చేయాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా దరదరలాడేలా చేస్తే రుచిగా ఉంటుంది.

ఈ పొడి పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి. తేమ లేకుండా ఉంచితే 1–2 నెలల వరకు బాగా ఉంటుంది. అంతే కరివేపాకు కారం రెడీ అయినట్లే. వేడి అన్నంలో ఒక స్పూన్ కరివేపాకు కారం పొడి వేసుకుని అందులో నెయ్యి లేదా నువ్వుల నూనె కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి టిఫిన్స్తో కూడా తినవచ్చు.

కరివేపాకులో ఇనుము, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రసవం తర్వాత శరీరానికి అవసరమైన పోషకాలు అందించడంలో ఇది సహాయపడుతుంది. అయితే బాలింతలు తమ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా వైద్యుడు లేదా పోషకాహార నిపుణుడి సలహా తీసుకుని ఆహారంలో చేర్చుకోవడం మంచిది.