
The International Cricket Council: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆలస్యంగా బౌలింగ్ చేసిన ఓవర్లకు పెనాల్టీ విధానాన్ని ప్రవేశపెట్టింది. బౌలింగ్ జట్టుకు ఓవర్ల మధ్య 60 సెకన్ల సమయం ఇవ్వనుంది. ఒక ఇన్నింగ్స్లో మూడుసార్లు ఆలస్యం జరిగితే బ్యాటింగ్ జట్టుకు మొత్తం ఐదు పరుగులు అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది.

మంగళవారం అహ్మదాబాద్లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ప్రయోగాత్మకంగా అమలులోకి తీసుకరానున్నారు.

ఓవర్ల మధ్య తీసుకునే సమయాన్ని నియంత్రించడానికి ఈ విధానం అమలు చేయనున్నారు. మునుపటి ఓవర్ పూర్తయిన 60 సెకన్లలోపు తదుపరి ఓవర్ బౌలింగ్ చేయడానికి బౌలింగ్ జట్టు సిద్ధంగా లేకుంటే, ఇన్నింగ్స్లో మూడోసారి జరిగినప్పుడు ఐదు పరుగుల పెనాల్టీ విధించబడుతుంది.

పిచ్, అవుట్ఫీల్డ్ మానిటరింగ్ నిబంధనలలో మార్పులకు బోర్డు అంగీకరించిందని, పిచ్ను అంచనా వేసే ప్రమాణాలను సరళీకృతం చేయడం, వేదిక అంతర్జాతీయ హోదాకు అనుకూలంగా లేనప్పుడు ఐదు డీమెరిట్ పాయింట్ల నుంచి ఆరుకు పెంచడం వంటి వాటికి కూడా బోర్డు అంగీకరించిందని ఐసీసీ తెలిపింది.

పురుషుల, మహిళల క్రికెట్లో ICC అంపైర్లకు మ్యాచ్ డే వేతనాన్ని సమం చేయడం, జనవరి 2024 నుంచి ప్రతి ICC మహిళల ఛాంపియన్షిప్ సిరీస్లో ఒక తటస్థ అంపైర్ ఉండేలా చూడటం వంటి మహిళా మ్యాచ్ అధికారుల అభివృద్ధిని వేగవంతం చేసే ప్రణాళికను CEC ఆమోదించింది.