
Ravindra Jadeja: ప్రపంచకప్ 2023లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో భారత జట్టు చారిత్రాత్మక విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 191 పరుగులకు ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన భారత్.. రోహిత్ శర్మ 80 పరుగుల కీలక ఇన్నింగ్స్తో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

పాకిస్థాన్ను స్వల్ప పరుగులకే పరిమితం చేయడంలో టీమిండియా బౌలర్లంతా చక్కటి ప్రదర్శన చేశారు. రవీంద్ర జడేజా రెండు కీలక వికెట్లు తీసి భారీ రికార్డు సృష్టించాడు.

అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రెండు వికెట్లు తీసిన జడేజా.. ఈ రెండు వికెట్లతో భారత గడ్డపై 100 వన్డే వికెట్లు సాధించాడు.

దీంతో పాటు వన్డే క్రికెట్లో ఇలాంటి ఘనత సాధించిన తొలి లెఫ్టార్మ్ బౌలర్గా నిలిచిన జడేజా.. వన్డే క్రికెట్లో 94 వికెట్లు తీసిన జహీర్ ఖాన్ను వెనక్కి నెట్టాడు. అంతేకాకుండా, భారత్లో వన్డే క్రికెట్లో 100 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆరో భారత బౌలర్గా జడేజా నిలిచాడు.

జడేజా కంటే ముందు అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, అజిత్ అగార్కర్, జవగల్ శ్రీనాథ్, కపిల్ దేవ్లు సొంతగడ్డపై 100 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించారు. కుంబ్లే 126, హర్భజన్ సింగ్ 110, అజిత్ అగార్కర్ 109, జవగల్ శ్రీనాథ్ 103, కపిల్ దేవ్ 100 వికెట్లు తీశారు.