
Rohit Sharma IPL Record: భారత క్రికెట్ దిగ్గజం, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలో మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో రోహిత్ తన బ్యాటింగ్తో విరుచుకుపడటమే కాకుండా, అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టాడు. ప్రస్తుతం ఈ రికార్డు రేసు ఆసక్తికరంగా మారింది.

సోమవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్ రోహిత్ శర్మకు ఐపీఎల్ కెరీర్లో 277వ మ్యాచ్. ఈ మ్యాచ్తో ఆయన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (276 మ్యాచ్లు) రికార్డును అధిగమించాడు. ప్రస్తుతం ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎంఎస్ ధోనీ 278 మ్యాచ్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ధోనీ రికార్డుకు రోహిత్ కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉండటం విశేషం.

ముంబై ఇండియన్స్ తుది జట్టులోకి తిరిగి వచ్చిన రోహిత్ శర్మ, తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. కేవలం 44 బంతుల్లోనే 84 పరుగులు సాధించి ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఇందులో 7 కళ్లు చెదిరే సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. 190.91 స్ట్రైక్ రేట్తో రోహిత్ ఆడిన ఈ ఇన్నింగ్స్ వంఖడే ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. తన ట్రేడ్మార్క్ పుల్ షాట్లు, రిస్ట్ ఫ్లిక్స్తో స్టేడియంను హోరెత్తించాడు.

ప్రస్తుతం ఎంఎస్ ధోనీ 278 మ్యాచ్లతో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ, ఆయన ఈ సీజన్లో పిక్క కండరాల గాయం (Calf Strain) కారణంగా ఇంకా బరిలోకి దిగలేదు. ఇదే తరుణంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వరుసగా మ్యాచ్లు ఆడుతుండటంతో, త్వరలోనే ధోనీని వెనక్కి నెట్టి వీరిద్దరూ అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. 39 ఏళ్ల వయసులోనూ రోహిత్ చూపుతున్న ఫిట్నెస్, ఫామ్ చూస్తుంటే, ఆయన మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు సాధించింది. వెస్టిండీస్ స్టార్ నికోలస్ పూరన్ కేవలం 21 బంతుల్లో 63 పరుగులు చేసి ఇన్నింగ్స్కు ఊపునిచ్చాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ మిచెల్ మార్ష్ 44 పరుగులు జోడించాడు. అయితే, ముంబై బౌలర్ కోర్బిన్ బాష్ ఒకే ఓవర్లో వీరిద్దరినీ అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఐడెన్ మార్క్రామ్ (31 నాటౌట్), హిమ్మత్ సింగ్ (40 నాటౌట్) రాణించడంతో లక్నో గౌరవప్రదమైన స్కోరు చేసింది.

అనంతరం లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ అందించిన మెరుపు ఆరంభంతో ముంబై విజయం సులువైంది. సూర్యకుమార్ యాదవ్ (12), తిలక్ వర్మ (11) తక్కువ పరుగులకే వెనుదిరిగినప్పటికీ.. నమన్ ధీర్ (23), విల్ జాక్స్ (10 నాటౌట్) సమయోచితంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. విల్ జాక్స్ సిక్సర్తో మ్యాచ్ ముగించడం విశేషం. అభిమానులకు కంటి నిండా వినోదాన్ని పంచుతోంది. రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం ముంబై ఇండియన్స్కు కొండంత బలాన్ని ఇస్తుండగా, తదుపరి మ్యాచ్లలో ఆయన ధోనీ రికార్డును ఎప్పుడు దాటుతారోనని క్రికెట్ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.