
ఎంతో ఉత్కంఠ రేపుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జూన్ 7 బుధవారం నుంచి ప్రారంభం కానుంది. లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగే ఈ హైవోల్టేజీ మ్యాచ్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.

2021 జూన్లో జరిగిన తొలి ఎడిషన్ ఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై ఓడిపోయింది. ఇప్పుడు వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన టీమ్ ఇండియా.. తొలి ట్రోఫీని కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

లండన్లో ప్రస్తుత వాతావరణం, వాతావరణ సూచనల ప్రకారం మ్యాచ్కు వర్షం ముప్పు లేదు. ఉష్ణోగ్రత కనిష్టంగా 15 డిగ్రీల సెల్సియస్ నుంచి గరిష్టంగా 22 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. కానీ, ఇంగ్లండ్లో వాతావరణం మారుతోంది. ఎప్పుడైనా వర్షం పడవచ్చని తెలుస్తోంది.

ఇక్కడి పిచ్ కూడా మిస్టరీ అని చెప్పొచ్చు. అది ఎలా ప్రవర్తిస్తుందో చెప్పడం కష్టం. గతంలో ఈ పిచ్ పేసర్లకు అనుకూలిస్తే, గత ఆరు మ్యాచ్లు అందుకు విరుద్ధంగా కనిపించాయి.

143 ఏళ్ల చరిత్ర కలిగిన ఓవల్ మైదానం అత్యధిక టెస్టు మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చిన రికార్డును కూడా సొంతం చేసుకుంది. మ్యాచ్ చివరి రెండు రోజుల్లో స్పిన్నర్లు మరింత ప్రభావవంతంగా కనిపిస్తుంటారు. పచ్చటి ఉపరితలం లేకపోవడంతో ఇక్కడ ఫాస్ట్ బౌలర్ల రికార్డు అంతగా బాగో లేదు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ స్టార్ స్పోర్ట్స్ టెలివిజన్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్లోనూ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు.

టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎస్ భరత్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.

ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కెమెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్చాగ్నే, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, టాడ్ మర్ఫీ, మిచెల్ స్టార్క్, మాథ్యూ రెన్షా.