IND vs WI 2nd Test: పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరుగుతున్న భారత్-వెస్టిండీస్ రెండో మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ(87), రవీంద్ర జడేజా(36) ఉన్నారు. అంతకముందు ఓపెనర్గా వచ్చిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో 80 పరుగులతో వెనుదిరిగాడు.
అయితే రోహిత్ తన ఇన్నింగ్స్లో 45 పరుగుల వద్ద టీమిండియా తరఫున వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్(2019 నుంచి..) 2000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. మొత్తంగా 2035 పరుగులతో భారత్ తరఫున డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అగ్రస్థానంలో నిలిచాడు.
విశేషమేమిటంటే.. డబ్ల్యూటీసీలో 2000 పరుగుల మార్క్ దాటిన రెండో ప్లేయర్గా, 2019 నుంచి అత్యధిక పరుగులు చేసిన టీమిండియా ఆటగాడిగా విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. భారత్ తరఫున రోహిత్, కోహ్లీ మాత్రమే 2 వేల డబ్ల్యూటీసీ పరుగులను పూర్తి చేసుకున్నారు.
అలాగే టీమిండియా తరఫున అత్యధిక డబ్ల్యూటీసీ పరుగులు చేసిన టాప్ 5 ఆటగాళ్ల లిస్టు ఇలా ఉంది.
2019 నుంచి జరుగుతున్న డబ్ల్యూటీసీలో రోహిత్ శర్మ ఇప్పటివరకు 25 మ్యాచ్లు ఆడాడు. అందులో అతను 7 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలతో మొత్తం 2035 పరుగులు చేసి భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అగ్రస్థానంలో ఉన్నాడు.
రోహిత్ తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. తన 34వ డబ్ల్యూటీసీ మ్యాచ్ ఆడుతున్న కింగ్ కోహ్లీ 2029 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇంకా రోహిత్ కంటే కోహ్లీ 6 పరుగుల దూరంలోనే ఉండడమే కాక ప్రస్తుతం వెస్టిండీస్తో జరుతుగున్న తొలి టెస్ట్లో కోహ్లీ క్రీజులోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో హిట్మ్యాన్ని అధిగమించి ఈ లిస్టు అగ్రస్థానంలోకి చేరేందుకు కోహ్లీకి అవకాశం ఉంది.
వీరిద్దరి తర్వాత టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ ఛతేశ్వర్ పుజారా మూడో స్థానంలో ఉన్నాడు. టీమిండియా తరఫున ప్రధానంగా టెస్టుల్లోనే కనిపించే పుజారా ఇప్పటివరకు 35 డబ్ల్యూటీసీ మ్యాచ్లు ఆడాడు. అందులో పుజారా ఒక సెంచరీ, 15 హాఫ్ సెంచరీలు చేశాడు.
అజింక్యా రహానే కూడా ఈ లిస్టులో ఉన్నాడు. ఇప్పటివరకు 29 డబ్ల్యూటీసీ మ్యాచ్ల్లో కనిపించిన రహానే 3 శతకాలు, 9 అర్థ శతకాలతో మొత్తం 1589 పరుగులు చేశాడు.
కారు ప్రమాదం కారణంగా క్రికెట్కి తాత్కాలికంగా దూరమైన రిషభ్ పంత్ కూడా 3 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలతో మొత్తం 1575 రన్స్ సాధించాడు. ఇందుకోసం పంత్ 24 డబ్ల్యూటీసీ ఆడాడు.