సచిన్ టెండూల్కర్... ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు సాధించిన ఈ క్రికెట్ దిగ్గజానికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా యువతలోనూ మాస్టర్ బ్లాస్టర్కు మంచి ఫాలోయింగ్ ఉంది.
ఈ నేపథ్యంలో సచిన్ క్రేజ్ను ఉపయోగించుకునేందుకు సిద్ధమైంది ఎన్నికల సంఘం. ఇందులో భాగంగా ఈ క్రికెట్ దిగ్గజాన్ని నేషనల్ ఐకాన్గా నియమించింది. సుమారు మూడేళ్ల పాటు ఈ కీలక పదవిలో కొనసాగనున్నారు సచిన్.
ఈ ఒప్పందం ప్రకారం ఓటింగ్ ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ.. దేశవ్యాప్తంగా ఓటర్లలో అవగాహన కల్పించే కార్యక్రమాల్లో సచిన్ టెండూల్కర్ భాగం కానున్నారు. దీనికి సంబంధించి ఈసీ, సచిన్ల మధ్య బుధవారం కీలక ఒప్పందం జరుగనుంది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయెల్ సమక్షంలో సచిన్తో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ఈ ఒప్పందం జరగనుంది.
గతంలో పంకజ్ త్రిపాఠి, ఎంఎస్ ధోనీ, ఆమిర్ ఖాన్, మేరీ కోమ్ తదితర సినీ, స్టోర్ట్స్ సెలబ్రిటీలు ఎన్నికల సంఘం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఓటింగ్పై తమదైన శైలిలో ప్రచారం నిర్వహించారు.