ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చేలా.. రూ. 4,592 కోట్ల వ్యయంతో నిర్మించనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి బుధవారం సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చి, సమగ్రాభివృద్ధికి బాటలు వేసే విధంగా.. రూ.21,844 కోట్ల వ్యయంతో విశాఖపట్నంలో నిర్మిస్తున్న వైజాగ్ టెక్పార్క్ లిమిటెడ్ (అదానీ గ్రూప్), రూ.194.40 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్ట్ పనులకు, విజయనగరం జిల్లాలో రూ. 23.73 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్కు కూడా ఇవాళ సీఎం జగన్ శంకుస్ధాపన చేయనున్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: రూ. 4,592 కోట్ల వ్యయంతో 2,203 ఎకరాల విస్తీర్ణంలో 36 నెలల్లో నిర్మాణం, ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణించేందుకు వీలు, పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఏడాదికి 1.8 కోట్ల మంది ప్రయాణించే విధంగా దశల వారీగా సౌకర్యాల విస్తరణ జరగనుంది.
భోగాపురం ఎయిర్పోర్టు విశేషాలు: భూసేకరణ, టెండర్ ప్రక్రియ పూర్తిచేసి ఎన్వోసీ, పర్మిషన్లు తీసుకొచ్చి ఎన్జీటీ, హైకోర్టు, సుప్రింకోర్టులలో న్యాయవివాదాలు పరిష్కరించి భోగాపురం ఎయిర్పోర్టు పనుల ప్రారంభానికి సర్వం సిద్దం చేశారు. పీపీపీ విధానంలో నిర్మించే విధంగా జీఎంఆర్ గ్రూపుతో ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఏడిసీఎల్) ఒప్పందం చేసుకుంది. ప్రయాణీకుల సౌకర్యార్ధం అత్యంత ఆధునికంగా ట్రంపెట్ నిర్మాణం, ఇటు విశాఖ, అటు శ్రీకాకుళం నుంచి వచ్చే ప్రయాణికులు నేరుగా విమానాశ్రయ టెర్మినల్కు చేరుకునేలా అనుసంధానం చేయనున్నారు. అంతర్జాతీయ ఎగ్జిమ్ గేట్వే ఏర్పాటుకు వీలుగా కార్గో టెర్మినల్, లాజిస్టిక్స్ ఎకో సిస్టమ్, తొలి దశలో 5,000 చ.మీ విస్తీర్ణంలో దేశీయ, అంతర్జాతీయ కార్గో టెర్మినల్ అభివృద్ది జరగనుంది.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రన్వే, కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ అప్రాన్, ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ట్రాఫిక్ కంట్రోల్ అండ్ టెక్నికల్ బిల్డింగ్, కార్గో బిల్డింగ్, మురుగునీటి శుద్ది ప్లాంట్, 16 వ నెంబర్ జాతీయ రహదారిని అనుసంధానిస్తూ రోడ్డు నిర్మాణం, కమర్షియల్ డెవలప్మెంట్ ఏరియా, కమర్షియల్ అప్రోచ్ రోడ్, సోలార్ ప్యానెల్స్ ఏరియా, ఏవియేషన్ అకాడమీ, మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్ హాలింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు.
విశాఖపట్నం–భోగాపురం మధ్య రూ. 6,300 కోట్లతో 55 కిలోమీటర్ల మేర 6 లేన్ల రహదారి నిర్మాణం, రెండువైపులా సర్వీసు రోడ్లు నిర్మాణం చేపట్టనున్నారు. ఎయిర్పోర్టు నిర్మాణ సమయంలో 5 వేల మందికి, సేవలు ప్రారంభం అయిన తర్వాత 10 వేల మందికి ప్రత్యక్షంగా, 80 వేల మందికి పరోక్షంగా ఉపాధి, పర్యాటక అభివృద్ది, ఇతర పెట్టుబడుల ద్వారా మరో 5 లక్షల మందికి ఉపాధి లబించనుంది.
ఎయిర్పోర్టు నిర్వాసితులకు పునరావాసం: విమానాశ్రయం కోసం స్వఛ్చందంగా ఇళ్ళను ఖాళీ చేసిన 4 గ్రామాల్లోని నిర్వాసిత కుటుంబాలకు రూ. 77 కోట్లతో పునరావాసం, శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే ఇళ్ళ నిర్మాణం పూర్తిచేసి వసతి కల్పించడం కూడా ఇప్పటికే జరిగింది