మొన్న విశాల్.. ఇప్పుడు ధనుష్.. తమిళ ఇండస్ట్రీలో నిర్మాతల మండలి స్టార్ హీరోలపై కొరడా ఝులిపిస్తుంది. తమ వరకు కంప్లైంట్స్ వచ్చాయంటే చాలు.. ఎదురుగా ఉన్నదెవరు అని చూడకుండా నిర్ణయాలు కఠినంగా తీసుకుంటున్నారు. కమిట్మెంట్కు మారుపేరులా ఉండే ధనుష్కు నిర్మాతలతో ఇష్యూ ఏంటి..? అసలేం జరుగుతుంది కోలీవుడ్లో..? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ..
మన దగ్గర స్టార్ హీరోలపై ఈగ వాలనివ్వరు నిర్మాతలు.. అడ్వాన్సులు తీసుకుని సినిమాలు చేయకపోయినా.. వాళ్లపై కంప్లైంట్స్ ఇచ్చే ధైర్యం ఎవరికీ ఉండదు. సర్దుకుపోతుంటారే తప్ప స్టార్ హీరోలతో తగువుకు పోరు మన నిర్మాతలు. కానీ తమిళనాట అలా కాదండోయ్.. అక్కడున్నదెవరైనా కొరడా ఝులిపిస్తుంటారు. మొన్న విశాల్.. ఇప్పుడు ధనుష్ విషయంలో ఇదే జరిగింది.
తాజాగా తమిళ నిర్మాతల మండలి సమావేశం జరిగింది. అందులో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అడ్వాన్సులు తీసుకుని సినిమాలు పూర్తి చేయలేదంటూ ధనుష్పై మండలికి ఫిర్యాదు వచ్చింది. దీనిపై తమిళ నిర్మాతల మండలి సీరియస్ అయింది. ఆగస్ట్ 15 తర్వాత ఏ కొత్త సినిమాకు అడ్వాన్స్ తీసుకోకూడదని తేల్చి చెప్పింది.
ఇకపై ధనుష్తో సినిమా చేయాలంటే నిర్మాతల మండలి అనుమతి తీసుకోవాల్సిందే అని అల్టిమేటం జారీ చేసింది. మొన్న విశాల్ విషయంలోనూ ఇదే చేసింది నిర్మాతల మండలి. ఆయన అధ్యక్షుడిగా ఉన్నపుడు 12 కోట్ల గోల్ మాల్ జరిగిందని.. ఆ లెక్క తేలేవరకు విశాల్తో సినిమా చేయాలంటే అనుమతులు తప్పనిసరి చేసారు ప్రొడ్యూసర్ కౌన్సిల్.
పెద్ద సినిమాల ఓటిటి డేట్స్ విషయంలోనూ నిర్మాతల మండలి డేరింగ్ స్టెప్ వేసింది. 8 వారాల తర్వాతే ఓటిటికి ఇవ్వాలని నిర్మాతలకు సూచించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాలన్నింటినీ అక్టోబర్ 31లోపు పూర్తి చేయాలని.. ఆగస్ట్ 16 తర్వాత కొత్త సినిమాలేవీ మొదలు పెట్టొద్దని నిర్మాతలకు సూచించింది కౌన్సిల్. మొత్తానికి కోలీవుడ్లో గట్టి మార్పుల కోసమే ప్రయత్నిస్తుంది అక్కడి నిర్మాతల మండలి.