
ఒక్క సినిమా చాలు ఇండస్ట్రీ అంతా మాట్లాడుకోడానికి..! అలాంటి సినిమానే డిజే టిల్లు.. ఆ హీరోనే సిద్ధూ జొన్నలగడ్డ. తాజాగా ఈ కుర్ర హీరో తన ఇమేజ్ మార్చుకునే పనిలో పడ్డారు. అదేంటి.. డిజే టిల్లుతో కిరాక్ ఇమేజ్ వచ్చింది కదా.. మార్చుకోవడం దేనికి అనుకుంటున్నారు కదా..?

ఒకేచోట ఉండిపోతే.. అక్కడే ఉంటాం. అందుకే ఇమేజ్ గిమేజ్ మనకొద్దంటున్నారు టిల్లు భాయ్. మరి దానికోసం ఏం చేస్తున్నారో తెలుసా..? డిజే టిల్లుతో రాత్రికి రాత్రే స్టార్ బాయ్ అయిపోయారు సిద్ధూ జొన్నలగడ్డ.

దీనికి ముందు పదేళ్లు ఇండస్ట్రీలో ఉన్నా ఈయన గురించి తెలిసింది లేదు.. మాట్లాడుకున్నది అస్సలే లేదు. కానీ డిజే టిల్లుతో జాతకం మారిపోయింది. ప్రస్తుతం ఈ చిత్ర సీక్వెల్ డిజే టిల్లు స్క్వేర్తో బిజీగా ఉన్నారీయన.

ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. సినిమా 2024, ఫిబ్రవరి 9న విడుదల కానుంది. సిద్ధూకి ఇండస్ట్రీలో డిమాండ్ బాగా పెరిగిపోయిందిప్పుడు. మినిమమ్ గ్యారెంటీ హీరో.. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో అగ్ర నిర్మాణ సంస్థలు కూడా ఈ హీరోతో సినిమాల కోసం పోటీ పడుతున్నాయి.

ఈ క్రమంలోనే ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్తో ఓ సినిమా మొదలుపెట్టారు. అలాగే వరసగా లేడీ డైరెక్టర్స్తోనే సినిమాలు చేస్తున్నారు. నీరజ కోనతో తెలుసు కదా ఈ మధ్యే మొదలైంది.

ఆ మధ్య నందిని రెడ్డితో ఓ సినిమా అనుకున్నా అది ఆగిపోయింది. నీరజ కోన సినిమా మాత్రం షూటింగ్ జరుపుకుంటుంది. మరోవైపు బొమ్మరిల్లు భాస్కర్ సినిమా సెట్స్పైనే ఉంది. ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలతో తన ఇమేజ్ మారిపోతుందని చెప్తున్నారు సిద్ధూ.

రఫ్ అండ్ టఫ్ కాకుండా.. పక్కింటి కుర్రాడి ఇమేజ్ కోసం చూస్తున్నారీయన. మరి ఆ ఇమేజ్ వీటితో వస్తుందో లేదో చూడాలి.