
కథ రాసుకుంటున్నపుడు దర్శకుడికి ఇది ఒక పార్ట్ అవుతుందా.. రెండు భాగాలవుతుందా అనే విషయంపై క్లారిటీ ఉండదా.?? సగం సినిమా అయ్యాకే కథ భారీగా ఉందనే విషయం అర్థమవుతుందా..? సొంత కథపైనే దర్శకులకు క్లారిటీ ఉండట్లేదా.. లేదంటే బడ్జెట్ పెరుగుతుందని సీక్వెల్స్ తీస్తున్నారా..? ఈ మధ్యే ఎందుకు సీక్వెల్స్ ఎక్కువయ్యాయి..? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ..

ఓ సినిమాకు యావరేజ్ రన్ టైమ్ రెండున్నర గంటలు. అటైనా ఉండొచ్చు.. ఇటైనా ఉండొచ్చు.. ఇదొక యావరేజ్ మాత్రమే. కానీ మన దర్శకులు తమ కథను రెండున్నర గంటల్లో చెప్పలేకపోతున్నారు. ఒకప్పుడు ఎంత పెద్ద కథైనా ఒకే సినిమాలో చూపించేవాళ్లు. కానీ ఇప్పుడు బడ్జెట్ ఇష్యూస్ ఉన్నాయి.. దాంతో చేసేదేం లేక ఒక సినిమాను రెండు ముక్కలు చేస్తున్నారు.

200 కోట్ల బడ్జెట్ అవుతున్నపుడు అది వెనక్కి వస్తుందనే నమ్మకాలు చాలా తక్కువగా ఉంటాయి. అదే రెండు భాగాలు చేస్తే బడ్జెట్ ఫిగర్ మారిపోతుంది. బాహుబలికి ఫస్ట్ టైమ్ రాజమౌళి ఇది చేసి సక్సెస్ అయ్యారు. 2 పార్ట్స్ కలిపి 2400 కోట్లు వసూలు చేసేసరికి కేజియఫ్తో ప్రశాంత్ నీల్ ఇదే రూట్ ఫాలో అయ్యారు.. 1500 కోట్లు కొల్లగొట్టారు.

మొన్నటికి మొన్న మణిరత్నం పొన్నియన్ సెల్వన్కు ఇదే అడ్వాంటేజ్ అయింది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే.. బడ్జెట్ పెరుగుతుందని సీక్వెల్స్ చేస్తున్నారా లేదంటే నిజంగానే కథలు అంతా భారీగా ఉంటున్నాయా అనేది అర్థం కావట్లేదు. బాహుబలి, కేజియఫ్, పుష్ప ఇవన్నీ సగం సినిమాలయ్యాకే 2 పార్ట్స్ అని అనౌన్స్ చేసారు. ఇప్పుడు దేవర కూడా. దీనివల్ల బడ్జెట్లో డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది.

ఫస్ట్ పార్ట్ హిట్టైతే.. సీక్వెల్కు చెప్పలేనంత క్రేజ్ వస్తుంది. అందుకే దేవరతో పాటు సలార్, ఓజి, హరిహర వీరమల్లు లాంటి సినిమాలను కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు దర్శకులు. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాకు 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అందుకే రికవరీ కోసం 2 పార్ట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎలా చూసుకున్నా 2 పార్ట్స్ అనేది కేవలం బిజినెస్ ప్లానింగ్లాగే వాడుకుంటున్నారు మన దర్శకులు.