
పెద్ద సినిమాలు వస్తున్నాయంటే చాలు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారేమో కానీ కామన్ ఆడియన్స్ మాత్రం కంగారు పడుతున్నారు. స్టార్ హీరోల సినిమాలు కదా.. హాయిగా కుటుంబంతో పాటు వెళ్లి సినిమాలు చూద్దాం అనుకుంటుంటే రేట్ల గోల వాళ్లను భయపెడుతుంది.

తాజాగా మరోసారి అదే జరిగేలా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కొన్ని పెద్ద సినిమాలు వచ్చినా కూడా టికెట్ రేట్లు పెంచుకోడానికి అనుమతులు కోరలేదు. ఎందుకులే.. ఇప్పుడున్న రేట్లకే ప్రేక్షకులు రావట్లేదు మళ్లీ ఇంకా రేట్లు పెంచితే వస్తారో లేదో అనే భయం నిర్మాతల్లో కనిపిస్తుంది. అందుకే భోళా శంకర్, భగవంత్ కేసరి సహా చాలా వరకు పెద్ద సినిమాలన్నీ నార్మల్ టికెట్ రేట్లతోనే వచ్చాయి.

అయితే ఇప్పుడు సలార్ దర్శక నిర్మాతలు మాత్రం మరోసారి రేట్ల పెంపుపై ఆలోచనలో పడిపోయారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 22న విడుదల కానుంది. దీనిపై ఉన్న అంచనాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కచ్చితంగా మొదటి రోజే 200 కోట్లు వసూలు చేసే సత్తా సలార్ సొంతం.

ఇప్పటికే బాహుబలి తర్వాత విడుదలైన సాహో, ఆదిపురుష్ కూడా మొదటి రోజే 100 కోట్లకు పైగా వసూలు చేసాయి. మొన్న లియో వచ్చి ఫస్ట్ డే 146 కోట్లు వసూలు చేసే వరకు.. ఈ ఏడాది 137 కోట్లతో ఆదిపురుష్ హైయ్యస్ట్ ఫస్ట్ డే గ్రాసర్గా ఉంది. టాక్తో పనిలేకుండా ప్రభాస్ సినిమాలకు వందల కోట్లు వస్తున్నాయి.

పైగా టికెట్ రేట్తో పని లేకుండా ఆడియన్స్ థియేటర్స్కు క్యూ కడుతున్నారు. అందుకే సలార్ టికెట్ రేట్లు పెంచుకునేలా ప్రయత్నాలు చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకుంటున్నారు. బడ్జెట్ ఎలాగూ 200 కోట్లకు పైగానే ఉంది కాబట్టి టికెట్ రేట్లు పెంచుకునే వెసలబాటు కూడా ఉంది.

50 నుంచి 80 రూపాయల వరకు రేట్లు పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో ఇప్పటికే 295 రూపాయలు మల్టీప్లెక్స్ టికెట్ ఉంది. దాన్ని 350 రూపాయలు చేసే అవకాశం లేకపోలేదు. మరోవైపు ఏపీలోనూ టికెట్ రేట్లు 225 రూపాయల వరకు పెరిగే అవకాశం కనిపిస్తుంది.

అలాంటప్పుడు కచ్చితంగా బ్లాక్బస్టర్ టాక్ వస్తే కానీ ఆడియన్స్ థియేటర్స్ వరకు వెళ్ళరు. ఏ మాత్రం తేడా జరిగినా ఆ ప్రభావం చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. మరి అంత దమ్ము సలార్లో ఉందా లేదా అనేది చూడాలిక. అన్నట్లు షారుక్ ఖాన్ డంకీతో పోటీ పడి మరీ సలార్ వచ్చేస్తుంది.