
పేరుకు హాలీవుడ్ సినిమా అయినా.. ఇండియాలోనూ రప్ఫాడిస్తుంటాయి జేమ్స్ కామెరూన్ సినిమాలు. ఈయన చేసిన టైటానిక్, అవతార్ మన సినిమాల కంటే ఎక్కువగా వసూలు చేసాయి. అంతెందుకు రెండేళ్ళ కింద అవతార్ 2 కూడా ఇండియాలో దాదాపు 500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దాంతో కామెరూన్ సినిమాలపై అంచనాలు ఎప్పుడూ అలాగే ఉంటాయని మళ్లీ నిరూపించింది అవతార్ 2.

జేమ్స్ కెమారూన్ కూడా తన సినిమాల నేపథ్యాన్ని ఇండియన్ మైథాలజీ నుంచే తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా పంచ భూతాలే అవతార్ కథకు స్పూర్థి అనే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే మొదటి భాగాన్ని నేల మీద ప్లాన్ చేసారు జేమ్స్. అవతార్ 2 అంతా నీళ్ళలో ఉంటుంది. అందుకే టైటిల్ అవతార్ వే ఆఫ్ వాటర్ అని పెట్టారు జేమ్స్ కామేరూన్.

తాజాగా అవతార్ 3 అప్డేట్స్ వచ్చాయి. మూడో భాగం నిప్పు నేపథ్యంలో ఉండబోతుంది. అందులో భాగంగానే పార్ట్ 3కి ఫైర్ అండ్ ఆష్ అనే టైటిల్ పెట్టారు. ఒమక్టయా, మెట్కైనా అనే రెండు కొత్త తెగలను పరిచయం చేయబోతున్నట్లు తెలిపారు ఈ దర్శక దిగ్గజం. పాండోరాలోనే ఇదొక విభిన్నమైన ప్రదేశం అంటూ క్లారిటీ ఇచ్చారు.

అవతార్ తొలి రెండు భాగాల్లో లేని చాలా అద్భుతాలు పార్ట్ 3లో ఉంటాయని ఊరిస్తున్నారు కామెరూన్. దీనికోసం సరికొత్త ప్రపంచంతో పాటు టెక్నాలజీ కూడా వాడనున్నట్లు తెలిపారాయన.

కచ్చితంగా అవతార్ 3 ఎడ్జ్ ఆఫ్ ది సీట్ అవుతుందంటున్నారాయన. మొత్తానికి పార్ట్ 1లో నేల, 2లో నీరు అయ్యాయి.. ఇప్పుడు 3లో నిప్పు ఉండబోతుంది. ఇక పంచ భూతాల్లో ఆకాశం, వాయువు మాత్రమే మిగిలాయి.