
దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్నాయి. యూపీఐ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. పెద్ద పెద్ద మాల్స్ నుంచి వీధి వ్యాపారి వరకు ప్రతీఒక్కరూ యూపీఐ స్కానర్ల ద్వారా కస్టమర్ల నుంచి పేమెంట్స్ స్వీకరిస్తున్నారు అయితే యూపీఐ చెల్లింపులు చేయాలంటే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. బ్యాంక్ అకౌంట్కు యూపీఐ పిన్ సెట్ చేసుకుని పేమెంట్స్ చేయాలి.

అయితే బ్యాంక్ అకౌంట్ లేకపోయినా యూపీఐ లావాదేవీలు చేయవచ్చు. యూపీఐ సర్కిల్ అనే ఆప్షన్ను డిజిటల్ పేమెంట్స్ యాప్స్ ప్రవేశపెట్టాయి. ఈ ఆప్షన్ ద్వారా ఎవరైనా తమ కుటుంబసభ్యులు, స్నేహితులకు తన అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్లు చేయడానికి అనుమతి ఇవ్వవచ్చు. పిల్లలకు, బ్యాంక్ అకౌంట్లు లేనవారికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

గూగుల్ పే, ఫోన్ పే, భీమ్ యాప్ వంటి వాటిల్లో యూపీఐ సర్కిల్ అనే ఆప్షన్ ఉంది. దీని ద్వారా ఎవరైనా సరే తమ అకౌంట్కు సెకండ్ వినియోగదారులను జత చేయవచ్చు. ఇందుకు సెకండ్ వినియోగదారుడు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాల్సిన అవసరం లేదు. వినియోగదారుడి బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా ద్వితీయ వినియోగదారుడు చెల్లింపులు చేయొచ్చు.

అయితే ప్రాథమిక వినియోగదారుడి కంట్రోల్లోనే బ్యాంక్ ఖాతా ఉంటుంది. ఎంత లిమిట్ వరకు ద్వితీయ వినియోగదారుడు తమ అకౌంట్లోని డబ్బులను వినియోగించవచ్చు అనేది సెటప్ చేసుకోవచ్చు. ఇక ప్రతీ చెల్లింపును ప్రాథమిక వినియోగదారుడు ఆమోదించాలా.. వద్దా అనేది నియంత్రించవచ్చు. రూ.15 వేల వరకు లిమిట్ పెట్టుకోవచ్చు.

అయితే యూపీఐ సర్కిల్ ఫీచర్ వాడుకోవాలంటే ప్రాధమిక వినియోగదారుడు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. ఆ తర్వాత ద్వితీయ వినియోగదారుడి ఫోన్ నెంబర్ సేవ్ చేసుకుని ఉండాలి. అలాగే యూపీఐ యాప్ ఇన్ స్టాల్ చేసుకుని ఉండాలి. ఆ తర్వాత ద్వితీయ వినియోగదారుడికి యూపీఐ పిన్తో కూడా ఆహ్వానం వెళుతుంది. దీని ద్వారా చెల్లింపులు ఈజీగా చేయవచ్చు.