
రైళ్లలో ప్రయాణం చేసేందుకు ముందుగానే ఎక్కువమంది టికెట్లను బక్ చేసుకుంటూ ఉంటారు. దీని వల్ల సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చు. అయితే మనం ప్రయాణం చేయాల్సిన రైళ్లు ఆలస్యమవుతూ ఉంటాయి. కొన్నిసార్లు గంటల కొద్ది లేట్గా నడుస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ప్రయాణికులు రైల్వేశాఖ నుంచి కొన్ని ప్రయోజనాలు పొందవచ్చు.

ఎక్కువసేపు ఆలస్యమైతే ఉచితం వసతి, భోజన సదుపాయం కూడా ఉంటుంది. అయితే ఈ నిబంధనల గురించి చాలామందికి తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు. దీంతో వీటి పట్ల అవగాహన కలిగి ఉంటే మీరు ఎలాంటి అవాంతరాలు లేని ప్రయాణం చేయవచ్చు. ట్రైన్ ఆలస్యమైనప్పుడు రైల్వేశాఖ నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

రైలు రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యమైతే స్టేషన్ సిబ్బందిని సంప్రదించాలి. దీంతో ఉచిత వసతితో పాటు భోజన సదుపాయం కల్పిస్తారు. అయితే ఈ సౌకర్యం కేవలం ప్రీమియం రైళ్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రాజధాని, దురంతో, శతాబ్ది లాంటి ప్రీమియం రైళ్లలో మాత్రమే ఈ అవకాశం ఉంది. ఆలస్యమైన సమయాన్ని బట్టి మీకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్ అందిస్తారు.

ఐఆర్సీటీసీ క్యాటరింగ్ పాలసీ ప్రకారం రైలు 2 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే ఈ సదుపాయాలు ఉంటాయి. ఫ్లైట్ ఆలస్యమైనప్పుడు విమానయాన సంస్థలు ఉచితంగా హోటల్, ఫుడ్ అందిస్తాయి. ఇప్పుడు రైల్వేశాఖ కూడా ప్రీమియం రైళ్లల్లో అలాంటి నిబంధనలను వర్తింపచేస్తోంది. కానీ చాలామంది ప్రయాణికులకు వీటి గురించి తెలియకపోవడంతో ఉపయోగించుకోలేకపోతున్నారు.

ట్రైన్లో ప్రయాణం చేయాలనుకునే సమయంలో రైల్వే నిబంధనల గురించి ప్రతీఒక్కరూ అవగాహన కలిగి ఉండటం అనేది చాలా ముఖ్యం. దీని వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలగదు. ఇవే కాకుండా రైళ్లల్లో అనేక నియమాలు ఉంటాయి. వీటి గురించి కూడా తెలిసి ఉండాలి.