
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు విద్యుత్ ఆధారిత వాహనాల వాడానికి పెద్ద పీట వేస్తుండడంతో ఈ రంగంలోకి అన్ని బడా కంపెనీలు అడుగుపెడుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా.. మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది.

టాటా టియాగో ఈవీని లాంచ్ చేసింది. రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు వేరియెంట్స్లో వీటిని విడుదల చేశారు. 19.2kWh బ్యాటరీ కారు ధర రూ.8.49 లక్షల నుంచి, 24 kWh బ్యాటరీ కారు ధర రూ.9.09 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

అక్టోబర్ 10 నుంచి ఈ కార్ల బుకింగ్స్ ప్రారంభమవుతుండగా, తొలి 10 వేల మంది వినియోగదారులకు మాత్రమే ఈ ధర వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. ఇక వచ్చే ఏడాది జనవరి నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. కారు బ్యాటరీకి 8 ఏళ్లు లేదా 1,60,000 కి.మీల వరకు కంపెనీ వ్యారంటీ ఇస్తోంది.

19.2 kwh కారు ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 3.3 kW AC ఛార్జర్తో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కారును ఒక్కసారి చార్జింగ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇక 24 kWh బ్యాటరీ వేరియంట్ కారు విషయానికొస్తే 7.2 kW ఏసీ ఛార్జర్తో తీసుకొస్తున్నారు. ఒకసారి చార్జ్ చేస్తే 315 కిలోమీటర్లు వెళ్లొచ్చు.

ఈ కార్లలో టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఎలక్ట్రిక్ ORVMs, క్రూజ్ కంట్రోల్, స్టార్ట్/స్టాప్ పుష్ బటన్, లెదర్ సీట్స్, ఆటో హెడ్ల్యాంప్స్ వంటి ఫీచర్లు అందించారు. సిటీ, స్పోర్ట్ డ్రైవింగ్ మోడ్స్ ఇస్తున్నారు. రిమోట్ ఎయిర్ కండీషనింగ్ కంట్రోల్, రిమోట్ జియో ఫెన్సింగ్, వెహికల్ ట్రాకింగ్ వంటి మొత్తం 45 కనెక్ట్డ్ ఫీచర్లు ఉన్నాయి.