
ఇండియా-యూరోపియన్ యూనియన్(ఈయూ) మధ్య ఒప్పందంతో బంగారం, వెండి రేట్లు పరుగులు పెడుతున్నాయి. పసిడి ధరలు మరింత ఊపందుకుని రెచ్చిపోతున్నాయి. మంగళవారం ట్రేడింగ్ సెషన్లో వెండి ధరలు గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయి. ట్రేడింగ్ సెషన్లో కేవలం 250 నిమిషాల్లోనే వెండి ధరలు రూ.30 వేలు పెరిగాయి. అంటే ఒక్కో నిమిషానికి రూ.120 మేర పెరిగింది

సోమవారం అంతర్జాతీయ మార్కెట్లలో వెండి ధర 110 డాలర్లకు చేరుకోగా.. భారత ప్యూచర్ మార్కెట్లో కూడా అదే స్థాయిలో పెరిగింది. కేవలం 24 గంటల్లోనే వెండి ధర 100 నుంచి 110 డాలర్లకు చేరుకుంది. దేశీయ ప్యూచర్, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో 250 నిమిషాల ట్రేడింగ్ సెషన్లో కిలో వెండిపై రూ.30,122 పెరిగాయి. దీంతో కేజీ సిల్వర్ ప్రస్తుతం రూ.3,64,821కి చేరుకుంది.

4 లక్షల మార్క్కు చేరువలో వెండి ధర ఉంది. రేపో, మాపో 4 లక్షలకు చేరుకోనుంది. మధ్యాహ్నం 2.50 గంటల సమయంలో ఎంసీఎక్స్లో రూ.27,301 పెరిగి రూ.3,62,000 వద్ద ట్రేడవుతున్నాయి. గత వారం ట్రేడింగ్ సెషన్లో రూ.3,34,699 వద్ద ముగిశాయి. ఇక మల్టీ కమోడిటీ ఎక్సేంజ్లో మంగళవారం ఉదయం 9 గంటలకు కిలో వెండి రూ.3,39,824 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి.

జనవరి నెలలో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో వెండి ధరలు కిలోకు రూ.1,29,120 మేర పెరిగింది. ఈ వారంలో వెండి ధరలు మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. మంగళవారం అమెరికా మార్కెట్లో సిల్వర్ ప్యూచర్స్ 3 శాతం తగ్గి ఔన్సుకు 111.90 డాలర్లకు చేరుకోగా.. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 8.56 శాతం పెరిగాయి. దీంతో ఔన్సు 112.66 డాలర్లకు చేరుకున్నాయి.

ట్రంప్ సుంకాలు, డాలర్ బలహీనడపటం వల్ల బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ అనలిస్టులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయి అంటున్నారు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, భారత్-ఈయూ డీల్ కారణంతో పసిడి ధరల్లో రానున్న రోజుల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.