
సురక్షిత పెట్టుబడి, స్థిరమైన ఆదాయం కోరుకునే వృద్ధులకు పోస్టాఫీసు పథకాలు మంచి ఎంపికగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా Senior Citizens Savings Scheme (SCSS) పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను కల్పించే ప్రజాదరణ పొందిన పథకం. ప్రస్తుతం ఈ పథకంపై ప్రభుత్వం సంవత్సరానికి 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇది అనేక బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువగా ఉండటం విశేషం.

ఈ పథకంలో కనీసంగా రూ.1,000తో ఖాతా ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి రూ.30 లక్షలు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.

60 సంవత్సరాలు పైబడిన వారు వ్యక్తిగతంగా లేదా జీవిత భాగస్వామితో కలిసి జాయింట్ ఖాతా తెరవవచ్చు. అలాగే 55–60 సంవత్సరాల మధ్య వయస్సు గల VRS ఉద్యోగులు, 50–60 సంవత్సరాల మధ్య రిటైర్డ్ రక్షణ సిబ్బంది కూడా నిబంధనల ప్రకారం పెట్టుబడి పెట్టవచ్చు.

ఈ పథకపు మెచ్యురిటీ కాలం 5 సంవత్సరాలు. అవసరమైతే మరిన్ని 3 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం ఉంది. ప్రతి త్రైమాసికానికి వడ్డీ చెల్లింపు జరుగుతుంది. అయితే గడువు పూర్తికాకముందే ఖాతా క్లోజ్ చేస్తే జరిమానా ఉంటుంది.

ఉదాహరణకు రూ.25 లక్షలు 8.2 శాతం వడ్డీతో పెట్టుబడి పెడితే, సంవత్సరానికి సుమారు రూ.2,05,000 వడ్డీ వస్తుంది. అంటే త్రైమాసికానికి రూ.51,250, నెలకు సుమారు రూ.17,083 ఆదాయం లభిస్తుంది. ఒకసారి పెట్టుబడి చేసిన తర్వాత ఆ కాలానికి వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది. దీంతో రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం పొందవచ్చు.