
ఏపీ ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు కానుందని తెలుస్తోంది. ఇప్పటికే బిల్డింగ్ పనులు పూర్తవ్వగా.. ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ కూడా జరుగుతోంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా ప్రారంభించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఏప్రిల్ 1న అపాయింటెడ్ డేగా ప్రకటించేందుకు అధికారులు సిద్దమవుతున్నారు.

ఇంకా ఆరు వారాలు మాత్రమే సమయం ఉండటంతో రైల్వే జోన్ పనులను అధికారులు వేగవంతం చేశారు. ఈ నెలాఖరు కల్లా కొత్త జోన్ ప్రారంభంపై అధికారికంగా ఓ ప్రకటన రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం సికింద్రాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ నడుస్తోంది. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ ఈ జోజ్ పరిధిలో ఉన్నాయి.

కానీ విశాఖలో కొత్త రైల్వే జోన్ ప్రారంభమైతే.. దక్షిణ మధ్య రైల్వే జోన్లో హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ మాత్రమే ఉండనున్నాయి. విజయవాడ, గుంటూరు, గుంతకల్లుతో పాటు తూర్పు కోస్తా జోన్లోని కొంతభాగం విశాఖలోని కొత్త జోన్లో చేరుతాయి. ఇక గుంతకల్లు డివిజన్లోని రాయచూరు-వాడి మధ్య లైన్ సికింద్రాబాద్ జోన్లోనే ఉండనుంది.

ఇక మోటుమర్రి-కొండపల్లి మధ్య ఉన్న 46 కిలోమీటర్ల లైన్ విజయవాడ డివిజన్లోకి రానుంది. కొత్త జోన్ వల్ల ఏపీలో రైల్వే కనెక్టివిటీలో వేగం పెరగనుంది. ఇక సరుకు రవాణా సామర్థ్యం పెరగడం వల్ల కొత్తగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక స్థానికంగా ఆర్ధిక వృద్దికి ఇది దోహదపడుతుందని చెప్పవచ్చు.

కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు కొత్త రైళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక కృష్ణపట్నం, విశాఖపట్నం పోర్ట్లకు రైల్వే కనెక్టివిటీ పెరుగుతోంది. రైల్వే రిక్రూట్మెంట్లలో స్థానిక యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. ఇలా కొత్త రైల్వే జోన్ వల్ల అనేక లాభాలు ఉంటాయి. ఏపీ ప్రజలకు ఇది ఎంతో ప్రయోజనకంగా ఉండనుంది.