
రైలు ప్రయాణంలో మొబైల్ ఫోన్ పోవడం ప్రయాణికులకు పెద్ద ఇబ్బందిగా మారుతుంటుంది. ముఖ్యమైన కాంటాక్టులు, బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత ఫోటోలు అన్నీ ఒకే పరికరంలో ఉండటంతో ఆందోళన మరింత పెరుగుతుంది. ఇప్పటివరకు ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికులు రైలు దిగిపోయి పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారంగా దక్షిణ రైల్వే ఒక వినూత్న డిజిటల్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) టెలికమ్యూనికేషన్ విభాగం కలిసి ఈ సేవలను అందిస్తున్నాయి. ప్రయాణంలో ఫోన్ పోయిందని గుర్తించిన వెంటనే ప్రయాణికులు రైల్ మదద్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు లేదా 139 హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయవచ్చు. ఈ ఫిర్యాదు అందిన వెంటనే రైల్వే సిబ్బంది స్పందించి అవసరమైన చర్యలు ప్రారంభిస్తారు. తోటి ప్రయాణికుల ఫోన్ ద్వారా కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.

తదుపరి ముఖ్యమైన దశగా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్లో మొబైల్ వివరాలు నమోదు చేయాలి. ఫోన్ IMEI నంబర్ ఆధారంగా అధికారులు వెంటనే ఆ పరికరాన్ని బ్లాక్ చేస్తారు. దీంతో దొంగిలించిన వ్యక్తి దానిని ఏ నెట్వర్క్లోనూ ఉపయోగించలేడు, వ్యక్తిగత డేటా సురక్షితంగా ఉంటుంది.

ఈ విధానం వల్ల పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే తక్షణ రక్షణ లభిస్తుంది. ప్రయాణం కొనసాగుతూనే దర్యాప్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధుల కోసం రైల్వే సిబ్బంది ప్రత్యేక సహాయం అందిస్తున్నారు. టికెట్ ఎగ్జామినర్ (TTE) లేదా RPF సిబ్బందిని సంప్రదిస్తే వారు ఫిర్యాదు చేయడంలో సహకరిస్తారు.

నిపుణులు సూచించినట్లు ప్రతి ఒక్కరూ తమ మొబైల్ IMEI నంబర్ను ముందుగానే భద్రపరచుకోవడం చాలా అవసరం. సాంకేతికతను వినియోగించి ప్రయాణికుల భద్రతను పెంచే దిశగా తీసుకున్న ఈ చర్యలు రైల్వే ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చనున్నాయి.