
భారతదేశంలో బంగారం రోజువారీ అధికారిక ధరను ప్రకటించే బాధ్యత ప్రధానంగా ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్పై ఉంటుంది. ఈ సంస్థలో దేశంలోని ప్రముఖ బులియన్ వ్యాపారులు, బంగారం దిగుమతి చేసుకునే బ్యాంకులు, వివిధ ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. వీరంతా కలిసి ప్రతిరోజూ దేశంలోని ప్రధాన మార్కెట్ వ్యాపారుల నుంచి సమాచారాన్ని సేకరిస్తారు. అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్ గమనించి.. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో కొత్త బంగారం, వెండి ధరలను అధికారికంగా ప్రకటిస్తారు.

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం: బంగారం అనేది కేవలం ఒక దేశానికే పరిమితమైన వస్తువు కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా వర్తకం చేయబడే అంతర్జాతీయ కమోడిటీ. లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ అంతర్జాతీయంగా బంగారం ధరలకు ఒక ముఖ్యమైన బెంచ్మార్క్గా పనిచేస్తుంది. వివిధ దేశాల టైమ్ జోన్లు, ప్రపంచ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా గ్లోబల్ లెవెల్లో రేట్లు నిమిష నిమిషానికీ మారుతుంటాయి.

డాలర్ వర్సెస్ రూపాయి యుద్ధం: భారతదేశానికి సొంతంగా బంగారు నిల్వలు తక్కువ. మన దేశానికి అవసరమైన బంగారంలో దాదాపు 85 నుండి 90 శాతం వరకు విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటాం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వ్యాపారం అంతా అమెరికన్ డాలర్లలోనే జరుగుతుంది. కాబట్టి డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గినప్పుడు విదేశాల నుంచి బంగారం కొనడానికి ఎక్కువ ఖర్చవుతుంది. ఫలితంగా మన దేశంలో బంగారం ధరలు పెరుగుతాయి.

డిమాండ్ అండ్ సప్లై : మార్కెట్ ప్రాథమిక సూత్రం ప్రకారం.. ఒక వస్తువుకు డిమాండ్ పెరిగినప్పుడు దాని ధర కూడా పెరుగుతుంది. దేశంలో పెళ్లిళ్ల సీజన్ వచ్చినా.. లేదా ధంతేరస్, దీపావళి, అక్షయ తృతీయ వంటి పండుగలు వచ్చినా జనాలు బంగారం ఎక్కువగా కొంటారు. మార్కెట్లో బంగారం కొనుగోళ్లు పెరిగి, నిల్వలు తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ధరలు అమాంతం పెరిగిపోతాయి.

ప్రభుత్వ విధానాలు - పన్నులు: ప్రభుత్వం విధించే కస్టమ్స్ డ్యూటీ, జీఎస్టీ, ఇతర పన్నుల నిబంధనల వల్ల కూడా బంగారం ధరల్లో మార్పులు వస్తుంటాయి. ప్రభుత్వ ఆర్థిక విధానాలు మారినప్పుడల్లా బంగారం ధరలపై ఆ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి బంగారం ధరల్లో వచ్చే రోజువారీ హెచ్చుతగ్గులు ఏ ఒక్కరో తీసుకునే యాదృచ్ఛిక నిర్ణయం కాదు. ఇదంతా గ్లోబల్ మార్కెట్, రూపాయి విలువ, స్థానిక డిమాండ్ కలగలిసి పనిచేసే ఒక పక్కా ఫైనాన్షియల్ సిస్టమ్.