
ఎంతో మంది లోన్లు తీసుకొని.. ఈఎంఐలు చెల్లిస్తూ ఉంటారు. అలా ప్రతి నెలా ఈఎంఐలు చెల్లిస్తున్న వారికి గుడ్న్యూస్.. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంపీఎల్ఆర్) ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 7 నుంచి ఈ తగ్గింపు అమల్లోకి వచ్చింది. ఈ తగ్గింపుతో హొం లోన్, కారు లోన్లు, పర్సనల్ లోన్ల ఈఎంఐలపై ఈ తగ్గింపు అమలు కానుంది.

హెచ్డీఎఫ్సీ రెండేళ్ల కాలపరిమితి మినహా మిగతా అన్ని కాలపరిమితులలో ఎంసీఎల్ఆర్ను 0.05 శాతం తగ్గించింది. ఓవర్నైట్, ఒక నెల ఎంసీఎల్ఆర్ 8.60 శాతం నుంచి 8.55 శాతానికి, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.65 శాతం నుంచి 8.60 శాతానికి తగ్గించింది.

ఇక ఆరు నెలలు, ఏడాది కాలపరిమితి ఎంసీఎల్ఆర్ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.70 శాతానికి తగ్గించింది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 8.80 శాతం నుంచి 8.75 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపుతో ఈఎంఐలు కట్టేవారికి కాస్త ఊరట కలగనుంది.

ముఖ్యంగా ఫ్లోటింగ్ వడ్డీ రేట్లను ఎంచుకున్న రుణగ్రహీతలకు ఎంసీఎల్ఆర్ రేట్ల ద్వారా రుణ ఈఎంఐలు నేరుగా ప్రభావితమవుతాయి. ఎంసీఎల్ఆర్ తగ్గడం అంటే సాధారణంగా రుణాలపై వడ్డీ రేట్లు తగ్గినట్లే.

తాజా మార్పుతో ప్రస్తుత రుణగ్రహీతలు వారి రుణాల రీసెట్ కాలాన్ని బట్టి వారి నెలవారీ ఈఎంఐలలో స్వల్ప తగ్గుదలను పొందుతారు. ఆదా అయ్యేది తక్కువే అయినా.. ఎంతో కొంత తగ్గుతుండటం లోన్ తీసుకున్నవారికి కలిసొచ్చినట్టే.