
ఆర్ధిక లావాదేవీలను సక్రమంగా నిర్వహించుకునేందుకు బ్యాంకులతో ప్రతీఒక్క ఖాతాదారుడికి అవసరముంటుంది. బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు బదిలీ వరకు ప్రస్తుతం ఆన్లైన్లోనే అన్నీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కానీ చెక్ డిపాజిట్, రుణ దరఖాస్తుల వంటి పనుల కోసం బ్యాంకు బ్రాంచులను సంప్రదించాల్సి ఉంటుంది. ఇలాంటివారు తప్పనిసరిగా బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల మీ సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. ఈ వారంలో బ్యాంక్ సెలవుల గురించి ఒకసారి తెలుసుకుందాం.

జూలై 13 నుండి 19 వరకు ఈవారంలో నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడుతున్నాయి. జాతీయ, ప్రాంతీయ, మతపరమైన సెలవుల కారణంగా జూలైలో మొత్తం 12 సెలవు దినాలను ఆర్బీఐ ప్రకటించింది. వీటిల్లో రెండు, నాల్గవ శనివారం, ఆదివారాలు కూడా ఉన్నాయి. కొన్ని బ్యాంకు సెలవులు రాష్ట్రాలు లేదా ప్రాంతాలకు ప్రత్యేకంగా ఉంటాయి. ఇక గెజిటెడ్ జాతీయ సెలవు దినాల్లో దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులన్నీ మూతపడతాయి.

జూలై 16న రథయాత్ర/కాంగ్ (రథజాత్ర)/హరేలా సందర్భంగా భువనేశ్వర్, డెహ్రాడూన్, ఇంఫాల్లో బ్యాంకులు బంద్ కానున్నాయి. ఇక జూలై 17న యు. తిరోత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని షిల్లాంగ్లో బ్యాంకులు ఉండవు. జూలై 18న ద్రుక్పా త్షే-జిని పాటించేందుకు గాంగ్టక్లో బ్యాంకులు క్లోజ్ చేయనున్నారు. అలాగే జూలై 19న ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు ఉండవు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం.. అన్ని షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ బ్యాంకులు ప్రతి నెలా రెండు, నాల్గవ శనివారాలతో పాటు ప్రతి ఆదివారం తప్పనిసరిగా మూసివేయబడతాయి. ఈ రోజుల్లో వినియోగదారులు బ్రాంచ్లోని సేవలను పొందలేరు. జూలైలో మొత్తం నాలుగు ఆదివారాలు ఉంటాయి. కాబట్టి జూలై 5, 12, 19, 26 తేదీలలో బ్యాంకులు మూసి ఉంటాయి. జూలై 11 (రెండవ శనివారం), జూలై 25 (నాల్గవ శనివారం) తేదీలలో కూడా బ్యాంకులు మూసి ఉంటాయి.

బ్యాంకు సెలవు రోజుల్లో ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు సౌకర్యవంతమైన ఆర్థిక లావాదేవీల కోసం ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. మొబైల్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి సేవల ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. కేవలం ఆప్లైన్ సేవలు మాత్రమే నిలిచిపోతాయి.