
కొన్నిసార్లు బ్యాంకులు ఖాతాదారుల అకౌంట్ నుంచి పొరపాటున డబ్బులు కట్ చేస్తూ ఉంటాయి. వివిధ ఛార్జీల పేరుతో తప్పుగా డబ్బులు డెబిట్ అవుతుంటాయి. ఇలాంటప్పుడు ఎందుకు కట్ అయ్యాయో తెలియక కస్టమర్లు ఆందోళన చెందుతూ ఉంటారు. బ్యాంక్ కస్టమర్ కేర్కు కాల్ చేసి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే కస్టమర్ సర్వీస్ను సంప్రదించినంత మాత్రాన మీ డబ్బులు తిరిగి రావు.

మీ ఖాతా నుంచి డబ్బులు తప్పుగా డెబిట్ అయితే ఫిర్యాదు చేసేందుకు వివిధ మార్గాలు ఉన్నాయి. ముందుగా డబ్బులు కట్ అవ్వగానే బ్యాంక్ సిబ్బందిని సంప్రదించాలి. మూడు పనిదినాల్లోపు ఫిర్యాదు చేస్తే మీరు బాధ్యులు కారు. దీని వల్ల త్వరగా డబ్బులు తిరిగి వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఆలస్యం చేస్తే మరింత నష్టం జరగడంతో పాటు తిరిగి పొందటంలో జాప్యం జరగవచ్చు.

కస్టమర్ కేర్ను సంప్రదించడంతో పాటు మొబైల్, నెట్ బ్యాంకింగ్, ఈమెయిల్ విధానాల్లో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే బ్యాంక్కు వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం పొరపాటున కట్ చేసినప్పుడు 10 పనిదినాల్లోపు తిరిగి ఖాతాదారులకు జమ చేయాల్సి ఉంటుంది. లేకపోతే బ్యాంక్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రూపంలో అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది.

ఇక కొన్నిసార్లు బ్యాంకులు నిర్ణీత రేటు కంటే ఎక్కువ మొత్తాన్ని తీసివేయవచ్చు. ఇలాంటప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్, ఫీజు పట్టికల పత్రాలను భద్రపర్చుకోవాలి. దీంతో పాటు బ్యాంక్తో సంభాషించిన రికార్డులను మీ వద్ద ఉంచుకోండి. పటిష్టమైన డాక్యుమెంట్స్ ఉండటం వల్ల మీ డబ్బులు త్వరగా వెనక్కి పొందవచ్చు. బ్యాంకులో మీ సమస్య పరిష్కారం కాకపోతే ఆర్బీఐ అంబుడ్స్మెన్కు ఫిర్యాదు చేయవచ్చు.

2026,జులై 1వ తేదీ నుంచి ఆర్బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మెన్ స్కీమ్ తీసుకొచ్చింది. దీని ద్వారా బ్యాంక్ ఖాతాదారులు ఉచితంగా ఫిర్యాదు చేయవచ్చు. ముందుగా బ్యాంకులో ఫిర్యాదు చేయాలి. కంప్లైంట్ చేసిన 30 రోజుల్లో బ్యాంక్ సమాధానం ఇవ్వకపోతే అంబుడ్స్మెన్ను సంప్రదించాలి. ఇక ఆర్బీఐ హెల్ప్ లైన్ నెంబర్ 14448 కాల్ చేసి కూడా సహాయం పొందవచ్చు.