
దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు 8వ వేతన సంఘం ప్రకటనపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉద్యోగ సంఘాలు చేసిన తాజా డిమాండ్లను ప్రభుత్వం ఆమోదిస్తే, ప్యూన్ల నుంచి ఉన్నత స్థాయి ఐఏఎస్ అధికారుల వరకు అందరి జీతాల్లో భారీ పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం రూ.18,000గా ఉన్న కనీస మూల వేతనం సుమారు రూ.69,000కు పెరగవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.

ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన జాతీయ మండలి (జేసీఎం) ఉద్యోగుల విభాగ సమావేశంలో ఉద్యోగ సంఘాలు కీలక డిమాండ్లు ప్రభుత్వ ముందుంచాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మెట్రో నగరాల్లో అధిక జీవన వ్యయం కారణంగా ప్రస్తుత వేతన నిర్మాణం సరిపోవడం లేదని వారు పేర్కొన్నారు. దీంతో కొత్త వేతన విధానంలో పెద్ద మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు.

ఈ మార్పులో ప్రధాన పాత్ర పోషించేది ఫిట్మెంట్ ఫ్యాక్టర్. ఇది ప్రభుత్వ ఉద్యోగుల కొత్త మూల వేతనాన్ని నిర్ణయించే కీలక సూత్రం. 7వ వేతన సంఘంలో ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 2.57గా నిర్ణయించారు. ఇప్పుడు 8వ వేతన సంఘంలో దీనిని 3.83కు పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం దీనికి అంగీకరిస్తే, ప్రస్తుతం రూ.18,000 ఉన్న కనీస బేసిక్ పే సుమారు రూ.68,940కు చేరే అవకాశం ఉంది.

దీంతో ఉద్యోగులతో పాటు పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు కూడా భారీ ఊరట లభించనుంది. ఎందుకంటే పెన్షన్లు నేరుగా బేసిక్ పే ఆధారంగా లెక్కించబడతాయి. పే లెవెల్ల ప్రకారం జీతాల్లో గణనీయమైన పెరుగుదల కనిపించవచ్చు. లెవెల్-1లో ఉన్న ప్యూన్లు, అటెండెంట్ల జీతం రూ.18,000 నుంచి దాదాపు రూ.69,000కు పెరగవచ్చు. లెవెల్-2లోని లోయర్ డివిజన్ క్లర్క్ల జీతం రూ.19,900 నుంచి రూ.76,000 వరకు వెళ్లే అవకాశముంది.

కానిస్టేబుళ్లు, నైపుణ్యం గల కార్మికులు ఉన్న లెవెల్-3లో బేసిక్ పే రూ.21,700 నుంచి రూ.83,000 వరకు పెరగవచ్చని అంచనా. జూనియర్ క్లర్కులు, స్టెనోగ్రాఫర్లకు చెందిన లెవెల్-4 ఉద్యోగుల జీతం రూ.25,500 నుంచి రూ.97,000కు చేరవచ్చు. సీనియర్ అధికారుల జీతాలు కూడా భారీగా పెరగనున్నాయి. లెవెల్-13 అధికారుల జీతం రూ.1.23 లక్షల నుంచి రూ.4.71 లక్షలకు పెరగవచ్చని అంచనా. అత్యున్నత స్థాయి లెవెల్-18 అధికారుల వేతనం రూ.2.50 లక్షల నుంచి రూ.9.57 లక్షల వరకు చేరే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి.