
గంగా పరీవాహక పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా తీరము, వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం, దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. ఇది రాబోయే 48 గంటల్లో ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ఇప్పుడు జమ్మూ, చండీగఢ్, షాజహాన్పూర్, వారణాసి, గంగాపరీవాహక పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా తీరము, ఝార్ఖండ్ వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాలపై ఏర్పడిన సుస్పష్టమైన అల్పపీడన ప్రాంత కేంద్రం గుండా ప్రయాణించి, అక్కడి నుండి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు వెళుతుందని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే వర్షాల సమయంలో గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని స్పష్టం చేసింది.

అలాగే దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మంగళ, బుధ, గురువారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని.. వర్షాల సమయంలో బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని తెలిపింది.

ఇక రాయలసీమ మంగళ, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురుస్తాయని.. గురువారం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని తెలిపింది. ఈ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.