
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల గుండె జబ్బుల ముప్పు పెరుగుతోంది. అయితే, ప్రతిరోజూ గుప్పెడు వేరుశనగలు (పల్లీలు) తీసుకోవడం వల్ల గుండెపోటు ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు పల్లీలలో ఉండే మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రణలో ఉంచి గుండెను పటిష్టంగా ఉంచుతాయి. ప్రతి రోజూ గుప్పెడు పల్లీలు తినటం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే..

ధమనుల్లో ప్లాక్ను నిరోధిస్తుంది: గుండెకు రక్తాన్ని చేరవేసే ధమనులలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడాన్ని ప్లాక్ అంటారు. ఇది రక్తనాళాలను గట్టిగా, ఇరుకుగా మారుస్తుంది. వేరుశనగల్లో ఉండే మోనో అన్శాచురేటెడ్ (Monounsaturated), పాలీ అన్శాచురేటెడ్ (Polyunsaturated) కొవ్వు ఆమ్లాలు శరీరంలో హానికరమైన ఎల్డీఎల్ (LDL) కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. దీనివల్ల ధమనులలో కొవ్వు గడ్డకట్టే ప్రక్రియ ఆగిపోయి, గుండెకు రక్తప్రసరణ ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతుంది.

బీపీ నియంత్రణ, యాంటీ ఆక్సిడెంట్లు: పల్లీలలో మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తనాళాల ఒత్తిడిని తగ్గించి, రక్తపోటు (Blood Pressure) నియంత్రణలో ఉండేలా చూస్తాయి. అలాగే, వీటిలో ఉండే రెస్వెరాట్రాల్ (Resveratrol) అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ రక్తనాళాల లోపలి పొరలను దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇది గుండె కండరాలకు రక్షణ కవచంలా పనిచేస్తుంది.

పీచు పదార్థం, బరువు నియంత్రణ: వేరుశనగల్లో ప్రొటీన్లు, ఫైబర్ (పీచు పదార్థం) అధికంగా ఉంటాయి. వీటిని కొద్దిగా తిన్నా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇది అతిగా తినడాన్ని నిరోధించి, బరువు పెరగకుండా (Obesity) కాపాడుతుంది. ఊబకాయం తగ్గడం వల్ల పరోక్షంగా గుండెపై పడే భారం తగ్గుతుంది.

ఎలా తీసుకోవాలి?: రోజుకు ఒక గుప్పెడు (సుమారు 25-30 గ్రాములు) వేరుశనగలను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. నూనెలో వేయించినవి లేదా ఉప్పు ఎక్కువగా చల్లిన పల్లీల కంటే.. నీటిలో నానబెట్టిన పల్లీలు లేదా డ్రై రోస్ట్ (నూనె లేకుండా వేయించిన) చేసిన పల్లీలను తినడం వల్ల పూర్తి స్థాయి ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. మధుమేహం, గుండె జబ్బుల ముప్పు ఉన్నవారు తమ రోజువారీ డైట్లో పల్లీలను చేర్చుకోవడం ద్వారా సురక్షితంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.