రోడ్డు ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలను అనుమతించం…. నితిన్ గడ్కరీ
జాయింట్ వెంచర్స్ తో నిర్వహించే ప్రాజెక్టులతో బాటు హైవే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం వహించేందుకు చైనా కంపెనీలను అనుమతించబోమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలతో..
జాయింట్ వెంచర్స్ తో నిర్వహించే ప్రాజెక్టులతో బాటు హైవే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం వహించేందుకు చైనా కంపెనీలను అనుమతించబోమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలతో సహా వివిధ రంగాల్లో చైనా పెట్టుబడిదారులను కూడా అనుమతించే ప్రసక్తి లేదన్నారు. లదాఖ్ లో భారత, చైనా దళాల మధ్య ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రోడ్డు నిర్మాణ పనుల్లో చైనా భాగస్వాములుండే జాయింట్ వెంచర్లకు ఇక కాలంచెల్లినట్టే అని ఆయన వ్యాఖ్యానించారు. జాయింట్ వెంచర్ల ద్వారా చైనా కంపెనీలు మన దేశంలో ప్రవేశించే పరిస్థితి ఇక ఉండబోదని, దీనికి సంబంధించి త్వరలో ఓ పాలసీని రూపొందించి అమలు చేస్తామని ఆయన వివరించారు, అలాగే ప్రస్తుత టెండర్ల విధానంలో కూడా మార్పులు ఉంటాయని, మన దేశ సంస్థలకు ప్రాధాన్యం ఉండేలా బిడ్ల విధానాన్ని కూడా సవరించే యోచన ఉందని నితిన్ గడ్కరీ వివరించారు. పరిశ్రమల్లో చైనా ఇన్వెస్టర్లను అనుమతించబోమని ఆయన మళ్ళీ మళ్ళీ స్పష్టం చేశారు.