నిత్య పెళ్లికొడుకులు, నిత్య పెళ్లికూతుళ్లు ఇటీవలకాలంలో ఎక్కువైపోతున్నారు. పేర్లు, ఊర్లు, వేషధారణలు మార్చుకుంటూ పెళ్లళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటూ పలువుర్ని మోసం చేస్తున్నారు. డబ్బులు, నగల కోసం పెళ్లిళ్ల నాటకాలు ఆడి.. తీరా అవి చేతికి రాగానే పరారవడమే వారి పని అన్నట్లు వ్యవహరిస్తున్నారు కొందరు మోసగాళ్లు. తాజాగా.. చెన్నైలో నిత్యపెళ్లికూతురు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రేమ, పెళ్లిళ్లు పేరుతో పదేళ్లలో ఐదు పెళ్లిళ్లు చేసుకు నిషాంతి అనే మహిళ మోసాలకు పాల్పడింది. మెడికల్ స్టూడెంట్గా పరిచయం చేసుకుని పలువురు యువకులను టార్గెట్ చేసింది. ఆరు నెలల పాటు వారితో ప్రేమగా వ్యవహరించడం.. గ్రాండ్గా పెళ్లిళ్లు చేసుకోవడం.. ఆపై.. వేర్వేరు ఆస్పత్రులకు ట్రాన్స్ఫర్ పేరుతో డబ్బు, నగలతో పరారవడమే పనిగా పెట్టుకుంది. అయితే.. వన్ బ్యాడ్ డే.. సీన్ రివర్స్ అయింది. ఇన్స్టాగ్రామ్ వీడియోలతో నిత్యపెళ్లికూతురు మోసాలు బట్టబయలు అయ్యాయి.
ఈ నెల 20న మైలాడుదురై జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ శివచందర్ను నిషాంతి పెళ్లి చేసుకుంది. అయితే.. ఆ పెళ్లి వీడియోను శివచందర్ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోను చూసిన చిదంబరం ప్రాంతానికి చెందిన నెపోలియన్ అనే బాధితుడు షాకై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిత్యపెళ్లికూతురి గుట్టురట్టు అయింది. 2017లో నిషాంతి తనను పెళ్లి చేసుకుని మోసం చేసి పరారైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈరోడ్, చిదంబరం, మైలాడుదురైతోపాటు ఐదు చోట్ల నిషాంతిపై కేసులు నమోదు అయినట్లు గుర్తించారు.
పెళ్లిళ్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నిషాంతిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. 2010 నుంచి ఐదుగుర్ని పెళ్లి చేసుకున్నట్లు తేల్చారు. నిషాంతి మొదటి భర్త మృతిచెందగా.. ఆమెకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. పిల్లల్ని తన తల్లిదండ్రులకు అప్పగించి నిషాంతి మోసాలను అలవాటుగా మార్చుకున్నట్లు వెల్లడైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..