
ఉత్తరప్రదేశ్లో అత్యంత విషాదకరమైన, విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తి వేరొకరిని వివాహం చేసుకున్నాడన్న కోపంతో, ఒక వివాహిత మహిళ అతనిపై ఘాతుకానికి ఒడిగట్టింది. తన ప్రియుడి మర్మాంగాలను కోసివేసింది. హర్దోయ్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. పాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుజిదేయి గ్రామానికి చెందిన సుధీర్ కుమార్, పంకజ్ అనే వ్యక్తి భార్య అయిన ఆర్తి గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి మధ్య సాన్నిహిత్యం కొనసాగుతుండగానే, సుధీర్కు మే 6వ తేదీన జస్మాయి ఖిరౌనా గ్రామానికి చెందిన వేరే యువతితో వివాహం జరిగింది. తనను కాదని సుధీర్ మరో యువతిని పెళ్లి చేసుకోవడాన్ని ఆర్తి తట్టుకోలేకపోయింది. అప్పటి నుండి అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని సమయం కోసం వేచి చూసింది.
ఈ క్రమంలోనే, “ఒకసారి మాట్లాడాలి, నిన్ను కలవాలి” అని సుధీర్ను నమ్మించి కుర్సెలి గ్రామం వెలుపల ఉన్న ఒక చెరకు తోటకు ఆర్తి పిలిపించింది. ప్రియురాలి మాటలు నమ్మి అక్కడికి వెళ్లిన సుధీర్తో ఆమె మొదట వాగ్వాదానికి దిగింది. పెళ్లి విషయమై ఇద్దరి మధ్య గొడవ తీవ్రం కావడంతో, ముందే పథకం వేసుకున్న ఆర్తి తన వద్ద ఉన్న పదునైన బ్లేడుతో సుధీర్ మర్మాంగాలను కోసివేసింది.
ఈ దాడితో సుధీర్ తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి విలవిలలాడాడు. గమనించిన అతని స్నేహితుడు వెంటనే సుధీర్ను మోటార్ సైకిల్పై షాహాబాద్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు అతడిని జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పాలి పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. నిందితురాలు ఆర్తిని అగంపూర్ తిరహా వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలిని ప్రస్తుతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఒక వివాహిత ప్రియుడిపై ఇలాంటి కిరాతకానికి పాల్పడటం ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..