
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరంలో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. బర్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వ బ్యాంక్ కాలనీలో నివసిస్తున్న పెయింట్ వ్యాపారి అనురాగ్ బఘేల్ మృతదేహం ఆయన సొంత ఇంటి బెడ్రూమ్లో లభ్యమైంది. కొన్ని రోజులుగా ఇంట్లోనే మృతదేహం ఉండిపోవడంతో దుర్వాసన రావడం ప్రారంభమైంది. దీంతో స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన బయటపడింది.
అనురాగ్ బఘేల్ ఇంటి మొదటి అంతస్తులో నివసిస్తున్న ఓ యువతి ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండటాన్ని గమనించింది. అనుమానం రావడంతో కిటికీలోంచి గదిలోకి తొంగి చూడగా, అనురాగ్ మంచంపై కదలికలు లేకుండా పడి ఉండటం కనిపించింది. వెంటనే ఆయన తమ్ముడు చేతన్కు సమాచారం అందించింది. చేతన్ అక్కడికి చేరుకుని గది తలుపు తెరిచి ఉండటాన్ని గమనించి లోపలికి వెళ్లగా, అన్న మృతదేహం కనిపించింది. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బర్రా పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
అనురాగ్ బఘేల్ పెయింట్ వ్యాపారం నిర్వహించేవారు. ఆయన కుటుంబంలో భార్య ప్రియాంక, కుమారుడు హన్స్, కుమార్తె చిత్రన్షి ఉన్నారు. పిల్లల చదువుల కోసం భార్య సుమారు ఆరు నెలల క్రితం ఢిల్లీకి వెళ్లగా, అప్పటి నుంచి అనురాగ్ కాన్పూర్లోని ఇంట్లో ఒంటరిగానే నివసిస్తున్నాడు. ఆటో విడిభాగాల వ్యాపారం చేస్తున్న తమ్ముడు చేతన్ కుటుంబ సభ్యులు తరచూ ఫోన్లో మాట్లాడేవారని పోలీసులు తెలిపారు. జూలై 30 సాయంత్రం ఇంటి బయట నడుస్తూ అనురాగ్ను చివరిసారిగా చూసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అనంతరం ఆయన బయట కనిపించకపోయినా, ఒంటరిగా ఉండటం వల్ల ఎవరికీ వెంటనే అనుమానం రాలేదు.
ప్రాథమిక విచారణలో అనురాగ్ బఘేల్ గుండెపోటుతో మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అసలు మరణానికి గల కారణం పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టమవుతుందని అధికారులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపించిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి అనుమానాస్పద ఆధారాలు లభించలేదని, వైద్య నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఒంటరిగా నివసిస్తున్న వ్యక్తి మరణం రోజులు గడిచినా బయటపడకపోవడం స్థానికులను కలచివేసింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..