Watch Video: రీల్స్‌ చేసేందుకు వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి.. చిక్కుకుపోయిన యువకులు! ఒకరు మృతి

రీల్స్‌ మోజు కొందరు కుర్రాళ్లను ఊహించని చిక్కుల్లో పడేసింది. రీల్స్‌ తీసేందుకు ఒక పాత వాటర్‌ ట్యాంక్‌ పైకి ఎక్కి అక్కడే చిక్కుకుపోయారు. దాదాపు 16 గంటలపాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్‌ తర్వాత ఎట్టకేలకు ఈ తెల్లవారు జామున భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్‌ వారిని సరక్షితంగా కిందకు దించింది. ఈ విచిత్ర ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌నగర్‌ జిల్లాలో శనివారం (మే 2) చోటుచేసుకుంది.

Watch Video: రీల్స్‌ చేసేందుకు వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి.. చిక్కుకుపోయిన యువకులు! ఒకరు మృతి
UP water tank incident

Updated on: May 03, 2026 | 7:20 PM

లక్నో, మే 3: ఉత్తర్‌ప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌నగర్‌ జిల్లా కాన్షీరామ్ అవాసియ్ కాలనీకి ఐదుగురు మైనర్‌ బాలురు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో రీల్స్‌ చేసేందుకు పాత వాటర్‌ ట్యాంక్‌పైకి ఎక్కారు. ఈ క్రమంలో చాలా ఎత్తుకు వెళ్లిన తర్వాత ఊహించని విధంగా ట్యాంక్‌ మెట్లు విరిగిపోయాయి. దీంతో అంత ఎత్తు నుంచి ముగ్గురు అబ్బాయిలు కిందపడిపోయారు. వారిలో ఒకరు తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. గాయ పడిన మరో ఇద్దరిని హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. ఇంకో ఇద్దరు ట్యాంక్‌పైనే చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నించింది.

వర్షం, రాత్రివేళ కావడంతో రెస్క్యూ ఆపరేషన్ విఫలమైంది. దీంతో బాధితులు రాత్రంతా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర అధికారుల అభ్యర్థన మేరకు సెంట్రల్ ఎయిర్ కమాండ్ (CAC)కు చెందిన ఐఏఎఫ్ ఎంఐ-17 వి5 హెలికాప్టర్‌ను రంగంలోకి దించారు. ఈ విమానం ఆదివారం ఉదయం 5.20 గంటల ప్రాంతంలో దాదాపు 15 నిమిషాలు రెస్క్యూ ఆపరేషన్‌ను చేపట్టింది. ట్యాంకర్‌పైన చిక్కుకుపోయిన వారిని తాళ్ల సాయంతో సురక్షితంగా కిందకు దించింది. అనంతరం ఆ ఇద్దరు యువకులను హెలికాప్టర్‌లో గోరఖ్‌పూర్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం), అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏడీఎం), అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఎస్డీఎం, సీఓ సదర్, ఇతర అధికారులు సంఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. సహాయక చర్యల సమయంలో విద్యుత్ శాఖ, పురపాలక శాఖ, జిల్లా పరిపాలన, ఎన్డీఆర్ఎఫ్ అధికారులను కూడా మోహరించారు. సమయానికి వేగంగా స్పందించి ప్రాణాలను కాపాడటంలో ఐఏఎఫ్ వృత్తి నైపుణ్యాన్ని, నిబద్ధతను ఈ రెస్క్యూ మిషన్ మరోసారి నిరూపించిందని భారత వైమానిక దళం తన సోషల్ మీడియా ఖాతా పోస్ట్‌లో పేర్కొంది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకునేందుకు వీలుగా అధికారులు మొదట ప్రత్యామ్నాయ రహదారిని నిర్మించడానికి ప్రయత్నించారు. అయితే తెల్లవారుజామున సుమారు 3 గంటలకు వర్షం ప్రారంభం కావడంతో పనులకు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత సైనిక హెలికాప్టర్ సహాయం కోరారు. ఈ ఘటనలో మృతి చెందిన యువకుడిని సిద్ధార్థ్‌గా గుర్తించారు. గాయపడిన శని, గోలు అనే మరో ఇద్దరు మాధవ్ ప్రసాద్ త్రిపాఠి వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన ఇద్దరు, పవన్ , కల్లు ట్యాంకు పైభాగంలో చిక్కుకుపోయారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us