అంబులెన్స్ లభించక, కారు రూఫ్ కి తండ్రి డెడ్ బాడీని కట్టి, ఆగ్రాలో ఓ వ్యక్తి దుస్థితి

| Edited By: Anil kumar poka

Apr 26, 2021 | 11:51 AM

దేశంలో కోవిడ్ చూపుతున్న నరకం అంతాఇంతా కాదు.. ఎక్కడికక్కడ హృదయ విదారక దృశ్యాలే ! ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లేదు. అంబులెన్సులు అందుబాటులో లేవు. దేశం ఎన్నడూ...

అంబులెన్స్ లభించక, కారు రూఫ్ కి తండ్రి డెడ్ బాడీని కట్టి, ఆగ్రాలో ఓ వ్యక్తి  దుస్థితి
Unable To Find Ambulance
Follow us on

దేశంలో కోవిడ్ చూపుతున్న నరకం అంతాఇంతా కాదు.. ఎక్కడికక్కడ హృదయ విదారక దృశ్యాలే ! ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లేదు. అంబులెన్సులు అందుబాటులో లేవు. దేశం ఎన్నడూ చూడని దారుణ పరిస్థితిని చూస్తోంది. ఆగ్రాలో ఓ వ్యక్తి కోవిడ్ తో మరణించిన తన తండ్రి మృతదేహాన్ని  అంబులెన్స్ లో శ్మశాన వాటికకు తీసుకువెళ్లేందుకు యత్నించాడు. అయితే ఎంత  సేపు గడచినా అంబులెన్స్ రాలేదు. దీంతో గత్యంతరం లేక తన కారు పై భాగానికే ఆయన డెడ్ బాడీని  కట్టి అంత్యక్రియల స్థలానికి తీసుకువెళ్లాడు. అక్కడ అంతా ఈ దుస్థితి చూసి కంట తడిపెట్టారు. అన్ని చోట్ల మాదిరే ఆగ్రాలో కూడా కరోనా వైరస్ పరిస్థితి ఘోరంగా ఉంది. రోజుకు సుమారు 600 కేసులు నమోదవుతున్నాయి. గత తొమ్మిది రోజుల్లో 39 మంది కరోనా రోగులు మృతి చెందారు. అంబులెన్స్ ల తీవ్ర కొరత కారణంగా మృతుల బందువులు వాటికోసం 6 గంటలకు పైగా నిరీక్షించాల్సి వస్తోంది. ఆగ్రాలోని ప్రైవేటు ఆసుపత్రులు రోగులను అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరిస్తున్నాయి. దగ్గరలోని మణిపురి, ఫిరోజాబాద్, మధుర వంటి జిల్లాలకు రెఫర్ చేస్తున్నాయి.  సకాలంలో వైద్య  చికిత్స లభించక ఈ జిల్లాల్లో వరుసగా  రోగులు మరణిస్తున్నారు.

దేశంలో ఇంతటి ఘోర పరిస్థితికి కేంద్రానిదే బాధ్యత అని సమాజ్ వాదీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కోవిడ్ పరిస్థితిపై కేంద్రానికి ముందు చూపు లేదని, దేశంలో  మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పై లోగడ పార్లమెంటరీ కమిటీలు ప్రభుత్వానికి పలు సిఫారసులు చేసినా వాటిని బుట్టదాఖలు చేసిందని దుయ్యబడుతున్నారు. ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని, అలాగే హాస్పిటల్స్ లో పడకల సంఖ్యను కూడా పెంచాల్సి ఉందని ఆరోగ్యంపై గల పార్లమెంటరీ స్థాయీ సంఘం గత నవంబరులోనే తన నివేదికలో సూచించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.