Sheshikala: పొలిటికల్ రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న చిన్నమ్మ.. మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి నుంచే శుభారంభం

రాజకీయాల్లోకి చిన్నమ్మ రీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. అన్నాడీఎంకే స్వర్ణోత్సవాలకు ముందు రోజే శశికళ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Sheshikala: పొలిటికల్ రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న చిన్నమ్మ.. మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి నుంచే శుభారంభం
Sheshikala

Updated on: Oct 14, 2021 | 4:01 PM

Sheshikala ready for political: రాజకీయాల్లోకి చిన్నమ్మ రీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. అన్నాడీఎంకే స్వర్ణోత్సవాలకు ముందు రోజే శశికళ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 16న అమ్మ సమాధి దగ్గర నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్త పర్యటనలకు రెడీ అయ్యారు.

తమిళనాడు రాజకీయాల్లో చిన్నమ్మ మళ్లీ హాట్‌ టాపిక్‌గా మారారు. రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానంటూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి చేసిన ప్రకటన ప్రత్యర్థుల్లో గుబులు పుట్టిస్తోంది. మరోవైపు, ఈ నెల 17 నాటికి అన్నాడీఎంకే ఏర్పడి 50 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా అన్నాడీఎంకే నేతలు రాష్ట్రవ్యాప్త వేడుకలకు రెడీ అయ్యారు. అయితే, ఈ సమయాన్నే శశికళ తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారు. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. ఈ నెల 16న చెన్నై మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి దగ్గరకు వెళ్లి.. అమ్మకు నివాళులర్పించనున్నారు. ఈ సందర్భంగా తనకు భద్రత కల్పించాలని చెన్నై పోలీస్‌ కమిషనర్‌కు లేఖ రాశారు. అనంతరం రాష్ట్రవ్యాప్త పర్యటనలకు సిద్ధమవుతున్నారు శశికళ. ఇప్పటికే జిల్లాల్లో అన్నాడీఎంకే నేతలకు ఫోన్లు చేసి పర్యటన ఏర్పాట్లుచేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.

ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే పరాజయం పాలవడంతో నేతల్లో అభిప్రాయభేదాలు తీవ్రమయ్యాయి. పార్టీని విజయతీరాలకు చేర్చడంలో ఇటు పన్నీర్‌సెల్వం, అటు పళనిస్వామి ఇద్దరూ విఫలమయ్యారని..పార్టీని నడిపించడం వారి వల్ల కాదని తేలిపోయిందంటోంది అన్నాడీఎంకేలోని ఓ వర్గం. ఆధిపత్యం కోసం ఇరువురు నేతలు కొట్టుకుంటున్నారని.. పార్టీని భ్రష్టు పటిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఇదే అదునుగా భావించిన శశికళ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయాల నుంచి తప్పుకుంటునట్టు ప్రకటించిన ఆమె.. ఇప్పుడు మనస్సు మార్చుకున్నారు. పార్టీ అంతర్గత కలహాలతోనే ఎన్నికల్లో ఓటమి పాలైందని.. పళనిస్వామి – పన్నీర్‌సెల్వం వర్గాల మధ్య ఆధిపత్యపోరు కొంపముంచిందని అంటున్నారు. దీంతో మళ్లీ లైన్లోకి వచ్చేశారు శశికళ.

ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం, పళనిస్వామి నాయకత్వంపై నమ్మకం లేని నేతలు శశికళ వైపు మొగ్గు చూపనున్నట్టు తెలుస్తోంది. అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలు ఈ ఏడాది చివరినాటికి ముగించాల్సి ఉంది. అందుకే ఈలోపు పార్టీని తన గ్రిప్ లోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు చిన్నమ్మ. శశికళ రాకతో తమిళనాట అన్నా డీఎంకే పార్టీకి పూర్వ వస్తుందని అభిమానులు ఆశపడుతున్నారు.

Read Also…  Amit Shah: మరోసారి సర్జికల్‌ స్ట్రయిక్స్‌ తప్పవు.. పాకిస్తాన్‌కు గట్టి వార్నింగ్‌ ఇచ్చిన హోంమంత్రి అమిత్ షా

Loading...
Unable to load recommendations.
Follow Us