మారువేషంలో భక్తుడిలా వెళ్ళిన మంత్రి.. ఆలయ పూజారుల లీలలు బట్టబయలు!

తూత్తుకుడి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సాగుతున్న అక్రమ యవ్వారం బయటపడింది. విఐపి దర్శనం పేరిట కొందరు పూజారులు భక్తులను తీవ్రంగా దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సాధారణ భక్తుల నుంచి రూ. 4,000 నుండి రూ. 10,000 వరకు అక్రమంగా వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.

మారువేషంలో భక్తుడిలా వెళ్ళిన మంత్రి.. ఆలయ పూజారుల లీలలు బట్టబయలు!
Tamilnadu Minister Ramesh

Updated on: May 29, 2026 | 12:59 PM

తూత్తుకుడి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సాగుతున్న అక్రమ యవ్వారం బయటపడింది. విఐపి దర్శనం పేరిట కొందరు పూజారులు భక్తులను తీవ్రంగా దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సాధారణ భక్తుల నుంచి రూ. 4,000 నుండి రూ. 10,000 వరకు అక్రమంగా వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారంపై ఎలాగైనా నిజా నిజాలు తేల్చాలని తమిళనాడు హిందూ మత, దేవాదాయ శాఖ మంత్రి రమేష్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.

ఆయన ఎవరికీ చెప్పకుండా, సాదాసీదా టీ-షర్టు ధరించి, ముఖానికి మాస్క్ పెట్టుకుని ఒక సామాన్య భక్తునిలా ఉదయాన్నే తిరుచెందూర్ మురుగన్ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ క్యూలో నిలబడి ఉన్న సమయంలో, ఒక పూజారి మంత్రిని సమీపించి, రూ. 4,000 ఇస్తే గంటల తరబడి వేచి ఉండాల్సిన పనిలేకుండా నేరుగా విఐపి దర్శనం కల్పిస్తానని ఆశ చూపాడు. దానికి మంత్రి అంగీకరించి, తన మొబైల్ ద్వారా సదరు పూజారి జీ-పే (G-Pay) నంబర్‌కు రూ. 4,000 నగదును బదిలీ చేశారు.

డబ్బులు అకౌంట్‌లో పడగానే సదరు పూజారి మంత్రిని లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే, తనిఖీ పూర్తయిన వెంటనే మంత్రి తన ముఖానికి ఉన్న మాస్క్ తీసి, తానే హిందూ మత, దేవాదాయ శాఖ మంత్రిని అని నిరూపించడంతో ఆ పూజారి ఒక్కసారిగా బిత్తరపోయాడు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన సదరు పూజారిని దేవాదాయ శాఖ అధికారులు వెంటనే అదుపులోకి తీసుకుని సుదీర్ఘంగా విచారించారు. తీవ్ర విచారణ అనంతరం, తాను తప్పు చేశానని, ఇకపై ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడనని సదరు పూజారి చేతితో స్వయంగా క్షమాపణ లేఖ రాసి ఇచ్చాడు.

వీడియో ఇక్కడ చూడండి…

ఈ ఘటన తర్వాత మంత్రి రమేష్ ఆలయంలో జరుగుతున్న వివిధ అవకతవకలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా భక్తుల నుంచి డబ్బులు వసూలు చేయడం సహా పరిపాలనలో ఉన్న పలు లోపాలను ఆయన గుర్తించారు. తప్పు చేసిన ఉద్యోగులు, పూజారులకు నోటీసులు జారీ చేసి, వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. “సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో భక్తుల దర్శనం, అన్నదానాలు, ప్రాథమిక సౌకర్యాలు, ఆలయ ఆస్తి రిజిస్ట్రేషన్ వివరాలు, పునరుద్ధరణ పనులపై పూర్తిస్థాయి విచారణ జరుగుతోంది. అవకతవకలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే, ఎలాంటి వివక్ష లేకుండా తక్షణ చర్యలు తీసుకుంటాం. ఆలయంలో పారదర్శక పరిపాలన అందిస్తాం.” అని మంత్రి రమేష్ తన ఎక్స్-సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. మంత్రి రమేశ్ తీసుకున్న ఈ ఆకస్మిక తనిఖీ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us