
రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లోని బజాజ్ నగర్ ప్రాంతంలో గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వేగంగా వస్తున్న ఓ టాక్సీ రోడ్డు పక్కన ఉన్న కూరగాయల వ్యాపారిని ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో కూరగాయల వ్యాపారి చికిత్స పొందుతూ మరణించాడు. ప్రమాదానికి కారణమైన సదరు కారు మూడు బైక్లు, ఒక లోడింగ్ వాహనాన్ని కూడా ఢీకొట్టింది. దీంతో టాక్సీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గోపాల్పుర నుంచి దుర్గాపుర రైల్వేస్టేషన్ వైపు వెళ్తున్న టాక్సీ అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయింది. ప్రమాద సమయంలో కారు గంటకు దాదాపు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. ఈ ఘటనలో అదే ప్రాంతంలో రోడ్డు పక్కన కూరగాయల వ్యాపారం చేసుకునే మహవా మండవర్ నివాసి మహేష్ సైని (50) మృతి చెందాడు. మృతుడు బజాజ్ నగర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. మహావీర్ నగర్ ప్రాంతంలో లోడింగ్ వాహనంలో కూరగాయల దుకాణాన్ని నడుపుతున్నాడు. రోజూ మాదిరిగానే గురువారం కూడా మహేష్ రోడ్డు పక్కన కూరగాయల బండిని ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం అతని ప్రాణాలను బలి తీసుకుంది.
పోలీసుల సమాచారం ప్రకారం.. వేగంగా వస్తున్న టాక్సీ మొదట లోడింగ్ వాహనాన్ని ఢీకొట్టి, ఆపై మహేష్ సైని కాళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ క్రమంలో సమీపంలోనే పార్క్ చేసిన మూడు బైక్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు వృద్ధులు టాక్సీలో ప్రయాణిస్తుండడంతో వారికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఆ ప్రయాణికులు మధ్యప్రదేశ్ కి చెందిన వారు. వీరు వైశాలి నగర్ నుంచి దుర్గాపుర రైల్వేస్టేషన్ వెళ్లేందుకు టాక్సీ ఎక్కినట్లు పోలీసులకు తెలిపారు. అదే రోజు సాయంత్రం రైలు ఎక్కాల్సి ఉండడంతో టాక్సీ బుక్ చేసుకున్నామని, అతివేగంగా వెళ్తున్న టాక్సీ డ్రైవర్ని పదేపదే హెచ్చరించినా తమ మాట పట్టించుకోలేదని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే బజాజ్ నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన మహేష్ సైనీని జైపురియా ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మహేష్ మృతి చెందాడు. కారు డ్రైవర్ జస్వీర్ సింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి ప్రధాన కారణం అతివేగమేనని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.