Rahul Gandhi: సూరత్‌ కోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్తున్న రాహుల్‌ గాంధీ.. సెషన్స్‌ కోర్టులో సోమవారం పిటిషన్‌

సూరత్‌ కోర్టు విధించిన రెండేళ్ల జైలుశిక్షపై సోమవారం సెషన్స్‌ కోర్టులో అప్పీల్‌కు వెళ్తున్నారు రాహుల్‌గాంధీ. కోర్టు తీర్పు కారణంగా రాహుల్‌ ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. సెషన్స్‌ కోర్టులో రాహుల్‌కు ఊరట లభిస్తుందా ? లేదా ? అన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Rahul Gandhi: సూరత్‌ కోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్తున్న రాహుల్‌ గాంధీ.. సెషన్స్‌ కోర్టులో సోమవారం పిటిషన్‌
Rahul Gandhi

Updated on: Apr 02, 2023 | 8:35 PM

పరువునష్టం దావా కేసులో సూరత్‌ కోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని రాహుల్‌ గాంధీ నిర్ణయించారు. సోమవారం గుజరాత్‌ లోని సెషన్స్ కోర్టులో అప్పీల్ చేయబోతున్నారు. 2019 నాటి పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు వల్ల రాహుల్ తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. దీనిపై ఆయన పైకోర్టు అయిన సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేయబోతున్నారు. ఈ కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన కోర్టు.. పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నెలపాటూ గడువు ఇచ్చింది.

కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలనీ లేదంటే తాత్కాలికంగా స్టే విధించాలని రాహుల్ కోరుతున్నట్లు తెలుస్తోంది. కింది కోర్టు తీర్పును కొట్టివేస్తే రాహుల్ గాంధీకి తిరిగి లోక్ సభ సభ్యత్వం దక్కుతుంది. కానీ, ఆయనను దోషిగా తేల్చిన తీర్పును సమర్థిస్తే రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహించిన కేరళలోని వాయనాడ్ నియోజకవర్గానికి తిరిగి ఎన్నికలు జరపాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంటుంది. అప్పుడు రాహుల్ 8 ఏళ్లపాటూ ఎన్నికల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోతారు.

ఎంపీగా అనర్హత వేటు పడడంతో రాహుల్‌గాంధీకి ఢిల్లీ లోని తన నివాసాన్ని ఖాళీ చేయాలని లోక్‌సభ హౌసింగ్‌ కమిటీ నోటీసులు ఇచ్చింది. తన నివాసాన్ని ఖాళీ చేయడానికి రాహుల్‌గాంధీ ఓకే చెప్పారు. అయితే ఈ వ్యవహారంలో బీజేపీ కక్ష్యగట్టి వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ మండిపడింది. రాహుల్‌గాంధీ కంటే ముందే చాలామంది ఎంపీలపై అనర్హత వేటు పడిందని , చట్టానికి తాను అతీతుడని రాహుల్‌ భావిస్తున్నారని బీజేపీ కౌంటర్‌ ఇచ్చింది.

ఇదిలావుంటే, రాహుల్‌గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు చేపట్టిన ఛలో రాజ్‌భవన్‌ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం