కోవిడ్-19 టెస్ట్ రేట్స్.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

| Edited By: Pardhasaradhi Peri

Jun 20, 2020 | 3:38 PM

దేశవ్యాప్తంగా కోవిడ్-19 టెస్టింగ్ రేట్లను ఒకేవిధంగాఉండేట్టు గరిష్ట పరిమితి విధించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. అనేక హాస్పిటల్స్ లో ఈ టెస్టింగ్ వ్యవహారం దారుణంగా ఉందని, కరోనా మృతుల  విషయంలో..

కోవిడ్-19  టెస్ట్ రేట్స్.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
Follow us on

దేశవ్యాప్తంగా కోవిడ్-19 టెస్టింగ్ రేట్లను ఒకేవిధంగాఉండేట్టు గరిష్ట పరిమితి విధించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. అనేక హాస్పిటల్స్ లో ఈ టెస్టింగ్ వ్యవహారం దారుణంగా ఉందని, కరోనా మృతుల  విషయంలో అవి పాటిస్తున్న వైఖరి గర్హనీయంగా ఉందని పత్రికల్లో వఛ్చిన వార్తలను పురస్కరించుకుని ఒకరు దాఖలు చేసిన ‘పిల్’ పై కోర్టు తనంతట తాను విచారణ చేపట్టింది. జస్టిస్ అశోక్ భూషణ్ ఆధ్వర్యాన గల బెంచ్.. దీన్ని విచారిస్తూ.. దేశంలో ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్ లు వివిధ రకాలుగా టెస్టింగ్ రేట్లు నిర్ధారించాయని, అవి  సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించే విషయాన్ని కేంద్రం  పరిశీలించాలని సూచించింది. కరోనా రోగులు, కరోనాతో మృతి చెందినవారి విషయంలో…. ఆస్పత్రులు ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన గైడ్ లైన్స్ ని పాటించేలా చూడాలని కేంద్రంతో బాటు రాష్ట్రాలను కూడా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

కరోనా క్రైసిస్ ని ‘హ్యాండిల్’ చేయడంలో ఢిల్లీ ప్రభుత్వ వైఖరి పట్ల, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్ ‘పాటిస్తున్న ‘నిర్వాకం’ పట్ల ఇటీవల కోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. అలాగే కరోనా టెస్టుల ఫలితాలను ప్రజలు గానీ, రోగులు గానీ నేరుగా సేకరించరాదని మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తిరిగి సమీక్షించాలని కోర్టు సూచించింది. హోం మంత్రిత్వ శాఖ గత మే 8 న జారీ చేసిన తాజా ‘డిశ్చార్జి పాలసీ’ ని అన్ని రాష్ట్రాలు పాటించాలని ఈ బెంచ్ కోరినట్టు పిటిషనర్ తెలిపారు. కరోనా రోగుల విషయంలో మీరెలాంటి పధ్దతులు పాటిస్తున్నారో తెలియజేయాలంటూ ఆ మధ్య సుప్రీంకోర్టు.. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. అలాగే ఆసుపత్రుల్లో స్టాఫ్ కి సంబంధించి స్టేటస్ రిపోర్టును సమర్పించాలని కూడా కోర్టు కోరింది.