
బంగ్లాదేశ్లో హిందూ యువకుడు దీపు చంద్రను హత్యచేసి, తగులబెట్టడంపై ఆగ్రహజ్వాలు భగ్గుమంటున్నాయి. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్, హిందూ సంఘాలు దేశ రాజధాని ఢిల్లీలో నిరసన ప్రదర్శన నిర్వహించింది. బంగ్లాదేశ్ హైకమిషన్ వెలుపల ఆందోళనకు దిగారు. బంగ్లాదేశ్లో చిక్కుకున్న భారతీయ పౌరుల భద్రత, ముఖ్యంగా వైద్య విద్యార్థుల క్షేమం గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు నిరసనగా VHP కార్యకర్తలు, బంగ్లా రాయబార కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. దీంతో అడ్డుకున్న పోలీసులతో హిందూ సంఘాల వాగ్వాదం చోటు చేసుకుంది. బారికేడ్లను తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. భద్రతా దళాలు జనాన్ని నియంత్రించడానికి ప్రయత్నించగా, నిరసనకారులు బారికేడ్లను ఛేదించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆందోళనకారులను లాఠీలతో చెదరగొట్టారు పోలీసులు. మరోవైపు బంగ్లా హైకమిషన్ కార్యాలయం దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు నిరసనగా.. VHP, హిందూసంఘాల ఆందోళనల నేపథ్యంలో అలర్ట్ ప్రకటించారు. బంగ్లాదేశ్లో హిందువులపై మూకదాడులు జరుగుతున్నాయని.. యూనుస్ ప్రభుత్వం ఈ దాడులను అరికట్టాలని హిందువుల డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలావుంటే, బంగ్లాదేశ్లో భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మను మంగళవారం (డిసెంబర్ 23) ఉదయం 10 గంటలకు ముందే విదేశాంగ మంత్రిత్వ శాఖకు పిలిపించారు. భారత డిప్యూటీ హైకమిషనర్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి అసద్ అల్ సియామ్ హైకమిషనర్ను పిలిపించారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో బంగ్లాదేశ్ మిషన్ల చుట్టూ పెరుగుతున్న భద్రతా సమస్యల కారణంగా ప్రణయ్ వర్మను పిలిపించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. భారతదేశంలోని అన్ని బంగ్లాదేశ్ కార్యాలయాల వద్ద భద్రతను మరింత బలోపేతం చేయాలని ఆయనను కోరారు.
బంగ్లాదేశ్లో హిందూ యువకుడి హత్యకు నిరసనగా శనివారం రాత్రి (డిసెంబర్ 20) ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వెలుపల నిరసన జరిగింది. ఈ నిరసన శాంతియుతంగా జరిగిందని, దీనివల్ల బంగ్లాదేశ్ హైకమిషన్ భద్రతకు ఎటువంటి ముప్పు లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఈ నిరసనలో 20 నుండి 25 మంది యువకులు మాత్రమే పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు.
డిసెంబర్ 22, 2025న, బంగ్లాదేశ్లోని ఢాకాలోని నేషనల్ ప్రెస్ క్లబ్ ముందు హిందూ సంస్థలు, మైనారిటీ సంఘాలు దీపు హత్యకు వ్యతిరేకంగా నిరసన తెలిపాయి. దీపు నిర్దోషి అని, అతనిపై దైవదూషణ ఆరోపణలు ఉన్నాయని నిరసనకారులు పేర్కొన్నారు. ఆ తర్వాత ఛాందసవాదులు అతన్ని తీవ్రంగా కొట్టి, చెట్టుకు ఉరితీసి, సజీవ దహనం చేశారు. అయితే, బంగ్లాదేశ్లో పరిస్థితి నిరంతరం దిగజారుతోందని విశ్వ హిందూ పరిషత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి 50 మందికి పైగా ముస్లిమేతరులు చంపబడ్డారని, ఇంకా చాలా మందిపై తప్పుడు ఆరోపణలతో కేసు నమోదు చేశారని వారు పేర్కొన్నారు.
ఢాకా ట్రిబ్యూన్ ప్రకారం, 27 ఏళ్ల దీపు చంద్ర దాస్ ఒక వస్త్ర కర్మాగారం అయిన పయనీర్ నిట్వేర్స్ (BD) లిమిటెడ్లో ఫ్లోర్ మేనేజర్గా పనిచేశాడు. అతను ఇటీవల సూపర్వైజర్ పదవికి పదోన్నతి పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో, కొంతమంది కార్మికులు దీపు మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ.. ఫ్యాక్టరీ లోపల నిరసన చేపట్టారని సీనియర్ ఫ్యాక్టరీ మేనేజర్ సకిబ్ మహమూద్ తెలిపారు. పని పరిస్థితులు, లక్ష్యాలు, కార్మికుల ప్రయోజనాలపై దీపు అనేక మంది సహోద్యోగులతో నిరంతరం వివాదాలను ఎదుర్కొంటున్నాడని దీపు సోదరుడు అపు చంద్ర దాస్ అన్నారు.
డిసెంబర్ 18, 2025న, వివాదం తీవ్రమైంది, ఫ్యాక్టరీ ఫ్లోర్ ఇన్చార్జ్ దీపును రాజీనామా చేయమని బలవంతం చేశారు. ఆ తర్వాత అతన్ని ఫ్యాక్టరీ నుండి బయటకు తీసుకెళ్లి జనసమూహానికి అప్పగించారు. దీపును పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తున్నామని అపు స్నేహితుడు హిమెల్ నుండి ఫోన్ వచ్చింది. కానీ కొద్దిసేపటి తర్వాత, అతను చనిపోయాడని సమాచారం ఇచ్చారు. అపు సంఘటనా స్థలానికి చేరుకునేసరికి, చెట్టుకు వేలాడుతూ శరీరం కాలిపోయి ఉండటం గమనించాడు. ఈ ఘటన ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలచివేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..