PM Modi: మూల్యం చెల్లించాల్సిందే.. మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్న విపక్షాలకు శిక్ష తప్పదు

మహిళా రిజర్వేషన్లను అడ్డుకునేందుకు విపక్షాలు ఎలా ప్రయత్నించాయో దేశం మొత్తం చూసిందని ప్రధాని మోదీ అన్నారు. మహిళలకు నేను క్షమాపణలు చెబుతున్నా. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ స్వార్థ రాజకీయాలకు మహిళా లోకం బలైందన్నారు. నారీశక్తిని ఎదగకుండా అడ్డుకున్నారని.. మహిళల కలలను ధ్వంసం చేశారని మండిపడ్డారు.

PM Modi: మూల్యం చెల్లించాల్సిందే.. మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్న విపక్షాలకు శిక్ష తప్పదు
Pm Narendra Modi

Updated on: Apr 18, 2026 | 9:18 PM

మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బిల్లును వ్యతిరేకించి విపక్షాలు తప్పుచేశాయన్నారు. బిల్లు అమలు చేయనందుకు మహిళలను క్షమాపణ కోరుతున్నానన్నారు. మహిళా రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. కొందరు మాత్రం నారీ శక్తిని ఎదగకుండా మహిళల స్వప్నాన్ని చిదిమేశారని.. బిల్లును ఎలా అడ్డుకున్నారో దేశం మొత్తం చూసిందన్నారు. కొందరికి దేశం కంటే రాజకీయాలే ఎక్కువని.. కానీ తమకు మాత్రం దేశ ప్రయోజనాలే ముఖ్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

ఆ క్రమంలోనే విపక్షాలపై ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌, డీఎంకే, టీఎంసీ, సమాజ్‌వాదీ వంటి కుటుంబ వారసత్వ పార్టీలు బిల్లుకు వ్యతిరేకంగా చప్పట్లు కొట్టి.. మహిళల ఆత్మాభిమానంపై దాడి చేశారన్నారు. మహిళా రిజర్వేషన్లను ఆపి సంబరాలు చేసుకున్నారని మండిపడ్డారు. వారిని మహిళా లోకం ఎప్పటికీ మర్చిపోదని.. 21వ శతాబ్ధపు మహిళలు చూస్తూ ఊరుకోరన్నారు. రిజర్వేషన్లు అడ్డుకున్నవారికి ఎప్పికైనా శిక్ష తప్పదన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా మహిళా లోకాన్ని అవమానించారని.. నారీశక్తి ఎవరి హక్కులనూ లాక్కునేది కాదన్నారు.

40 ఏళ్లుగా ఆగిపోయిన మహిళా రిజర్వేషన్లను 2029 నుంచే అమల్లోకి తెచ్చే ప్రయత్నం తమ ప్రభుత్వం చేసిందని.. దేశంలోని సగం జనాభాకు అధికారం కల్పించకుండా..
పవిత్ర ప్రయత్నాన్ని దెబ్బకొట్టారన్నారు. ఉత్తర, దక్షిణ, ఈశాన్య ప్రాంతం అనే తేడా లేకుండా ప్రతి మహిళకు మరింత శక్తి కల్పించాలని తాము చూశామని.. చిన్న, పెద్ద రాష్ట్రం అనే తేడా లేకుండా.. అందరికీ సమాన హక్కులు కల్పించే ప్రయత్నం చేశామని మోదీ స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌, వారి మిత్రపక్షాలు భ్రూణ హత్యకు పాల్పడ్డాయని.. వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. మహిళా రిజర్వేషన్లపై ద్వేషం ప్రదర్శిస్తూనే ఉన్నారని.. మహిళారిజర్వేషన్లు తెచ్చే ప్రయత్నం ఎప్పుడు చేసినా కాంగ్రెస్‌ అడ్డుకుంటూనే ఉందని మండిపడ్డారు. ఇన్నాళ్లు కాంగ్రెస్‌ పాపాలు కడిగేసుకుంటుందని అనుకున్నా
కానీ అలా జరగలేదని అన్నారు. దేశంలో ఉనికి కోల్పోతున్న కాంగ్రెస్.. తన ఉనికి కాపాడుకునేందుకు ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపిందన్నారు.

ట్రిపుల్ తలాఖ్, ఆర్టికల్ 370 రద్దునువ్యతిరేకించారు, అక్రమ వలసదారులను వెనక్కి పంపే ప్రయత్నాలు చేశారు. నక్సలిజాన్ని అంతంచేసే ప్రయత్నాలను అడ్డుకున్నారు. దేశం కోసం చేసే మంచిపనులను అడ్డుకున్నారుని మండిపడ్డారు. సంస్కరణలను కాంగ్రెస్‌ అడ్డుకుంటూ రావడంతోనే అనేక దేశాలు భారత్‌ కంటే ముందుకు దూసుకెళ్లాయన్నారు. అడ్డుపుల్లలు వేయడమే కాంగ్రెస్‌ సిద్ధాంతమని.. పొరుగుదేశాలతో ఉన్న వివాదాలను పరిష్కరించకుండా కాంగ్రెస్‌ కొనసాగిస్తూ దేశానికి కాంగ్రెస్‌ తీరని నష్టం చేసిందన్నారు. ఇది ఒక బిల్లుకు సంబంధించిన అంశం కాదని.. కాంగ్రెస్‌ విధానం, వ్యవహారశైలికి సంబంధించిందన్నారు

కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ, టీఎంసీ, డీఎంకేలు.. పదే పదే అదే పనిచేస్తూ వచ్చాయన్నారు. సాంకేతిక అంశాలను సాకుగా చూపుతూ మహిళల అధికారం లాగేసుకుంటున్నారని మోదీ అన్నారు. మహిళలకు అధికారం ఇస్తే తమ ఉనికి దెబ్బతింటుందని కుటుంబ వారసత్వ పార్టీలకు భయంపట్టుకుంది మండిపడ్డారు. గ్రామ పంచాయతీల్లో మహిళలు సత్తా చాటారని.. చట్టసభలకు రావాలని మహిళలు కోరుకున్నారని.. కానీ కొందరు మాత్రం వారి కలల నిజం కాకుండా చేస్తున్నారన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us