Budget 2023: దేశాభివృద్ధికి బలమైన పునాది.. ఇది అందరి ఆకాంక్షల బడ్జెట్: ప్రధాని మోడీ

|

Feb 01, 2023 | 3:13 PM

బడ్జెట్‌లో అనేక ప్రోత్సహాకాలు ప్రకటించామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం అనంతరం ప్రధాని మోడీ ప్రసంగించారు.

Budget 2023: దేశాభివృద్ధికి బలమైన పునాది.. ఇది అందరి ఆకాంక్షల బడ్జెట్: ప్రధాని మోడీ
Pm Modi
Follow us on

కేంద్ర బడ్జెట్‌లో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. రైతులు ,గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ నిధులు కేటాయించినట్టు చెప్పారు. చారిత్రక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన్నందుకు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌కు అభినందనలు అని అన్నారు. విశ్వకర్మలకు తొలిసారి బడ్జెట్‌లో స్థానం దక్కిందని.. బడ్జెట్‌లో అనేక ప్రోత్సహాకాలు ప్రకటించామని మోడీ పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం అనంతరం ప్రధాని మోడీ ప్రసంగించారు. అమృత్ కాల్ లో ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ భారతదేశ అభివృద్ధి కోసం బలమైన పునాదిని నిర్మిస్తుందని మోడీ ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ బడ్జెట్ పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, రైతులతో సహా అందరి ఆకాంక్షలను, కలలను నెరవేరుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్‌ భారత అభివృద్ధితోపాటు గొప్ప సంకల్పాన్ని నెరవేరుస్తుందన్నారు. మహిళల కోసం ప్రత్యేక పొదుపు పథకాన్ని ప్రారంభించామని.. మహిళా సాధికారత కోసం ఎన్నో చర్యలు చేపట్టినట్లు ప్రధాని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని వివరించారు.

దేశం కోసం కష్టపడి పనిచేసిన ‘విశ్వకర్మ’ ఈ దేశ సృష్టికర్త అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. తొలిసారిగా ‘విశ్వకర్మ’ శిక్షణ, సహాయానికి సంబంధించిన పథకాన్ని బడ్జెట్‌లో తీసుకొచ్చినట్లు వివరించారు. PM విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ ద్వారా సంపద్రాయ వృత్తుల వారికి చేయూతను అందించనున్నట్లు వివరించారు.

ఈ బడ్జెట్ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ గ్రోత్, గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ జాబ్‌లను మరింత ప్రోత్సహించేలా స్థిరమైన భవిష్యత్తు కోసం రూపొందించినట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. బడ్జెట్‌లో సాంకేతికత, కొత్త ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించామమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళల జీవితాలను సులభతరం చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.. మహిళా స్వయం సహాయక సంఘాలు వారి జీవితాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఇళ్లలో మహిళలకు సాధికారత కల్పించేందుకు ప్రత్యేక పొదుపు పథకం ప్రారంభించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..