PM Modi: నేవి సిబ్బందితో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు.. 2014 నుంచి ఎక్కడెక్కడో తెలుసా..?

దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ.. ఈసారి గోవా తీరంలో నేవీ సిబ్బందితో పండుగ జరుపుకోనున్నారు. ఇటీవల విజయవంతమైన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని ఆయన ఐఎన్ఎస్ విక్రాంత్‌లో సైనికులతో పంచుకోనున్నారు. 2014 నుంచి ప్రతి సంవత్సరం సరిహద్దులు, కీలక స్థావరాల్లో మోదీ సైనికులతోనే దీపావళి జరుపుకోవడం విశేషం.

PM Modi: నేవి సిబ్బందితో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు.. 2014 నుంచి ఎక్కడెక్కడో తెలుసా..?
Pm Modi To Celebrate Diwali With Navy Personnel

Updated on: Oct 20, 2025 | 8:56 AM

దేశమంతా దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. ప్రధాని మోదీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళికి స్వదేశీ నినాదాన్ని వినిపించారు. ప్రధాని మోదీ ఈసారి దీపావళిని గోవా తీరంలో నేవీ సిబ్బందితో కలిసి జరుపుకోనున్నారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారత్ దీటుగా జరిపిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని INS విక్రాంత్‌ యుద్ధనౌకలో మెన్ ఇన్ వైట్‌తో కలిసి ప్రధాని జరుపుకోనున్నారు. 2014లో ప్రధాని పదవిని చేపట్టినప్పటి నుంచి మోదీ ప్రతి దీపావళిని సాయుధ దళాల సిబ్బందితో చేసుకోవడం ఒక సంప్రదాయంగా మారింది.

ప్రతి దీపావళి స్పెషల్‌గా

ప్రధాని మోదీ 2014లో లడఖ్‌లోని సియాచిన్ హిమానీనదంలో భద్రతాదళాలతో కలిసి దీపాల పండుగను జరుపుకున్నారు. ఆ తర్వాత ఏడాది 1965 ఇండో-పాక్ యుద్ధంలో వీరులను సత్కరించడానికి ఆయన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని డోగ్రాయ్ యుద్ధ స్మారక చిహ్నాన్ని సందర్శించారు. 2016లో ప్రధాని హిమాచల్ ప్రదేశ్‌లోని సుమ్డో వద్ద భారత్-చైనా సరిహద్దు సమీపంలో బీఎస్ఎఫ్ సిబ్బందితో వేడుకలు జరుపుకున్నారు. మరుసటి ఏడాది ఆయన జమ్మూ కాశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్‌లో బలగాలను కలిశారు.

1971 యుద్ధ స్థలంలో

2018లో మోదీ దీపావళిని ఉత్తరాఖండ్‌లోని హర్సిల్‌లోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు సిబ్బందితో కలిసి చేసుకున్నారు. ఆ తర్వాతి ఏడాది ఆయన జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరిలో సైనికులను కలిశారు. 2020 కోవిడ్-19 మహమ్మారి సమయంలో రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని లాంగేవాలాలో ప్రధాని దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఇది 1971 చారిత్రక యుద్ధం జరిగిన ప్రదేశం.

కార్గిల్‌లో దీపావళి వేడుకలు

ప్రధానమంత్రి 2021 దీపావళిని జమ్మూ కాశ్మీర్‌లోని నౌషెరాలో సైనికులతో కలిసి చేసుకున్నారు. ఆ తర్వాత ఏడాది కార్గిల్‌లో సైనికులతో కలిసి దీపావళి చేసుకున్నారు. గత రెండు దీపావళి పండుగలను ఆయన హిమాచల్ ప్రదేశ్‌లోని లెప్చా, గుజరాత్‌లోని సర్ క్రీక్‌లో సైనిక దళాలను కలిశారు. ఈ ఏడాది గోవా తీరంలో నేవీ సిబ్బందితో దీపావళి జరుపుకోవాలనే ప్రధాని మోదీ నిర్ణయం దేశ రక్షణలో పాలుపంచుకుంటున్న ప్రతి దళానికి తన మద్దతును తెలియజేస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి