Mehbooba Mufti: మహిళలు, పిల్లలు చనిపోతున్నారు – మెహబుబా ముఫ్తీ కంటతడి

యుద్ధంపై కశ్మీర్‌ మాజీ సీఎం మెహబుబా ముఫ్తీ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, పిల్లలు చనిపోతున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. రెండు వైపుల నుంచి దాడులు ఆపాలని మెహబూబా విజ్ఞప్తి చేశారు. ఏం జరిగినా ముందుగా నాశనమయ్యేది కశ్మీర్‌ ప్రజలేనని మెహబూబా ఆవేదన వ్యక్తం చేశారు.

Mehbooba Mufti: మహిళలు, పిల్లలు చనిపోతున్నారు -  మెహబుబా ముఫ్తీ కంటతడి
Mehbooba Mufti

Updated on: May 09, 2025 | 1:32 PM

జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ నిరంతరం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. పాకిస్తాన్ సైన్యం సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతోంది. అయితే, పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు భారత సైన్యం కూడా తగిన సమాధానం ఇస్తోంది. ఇదిలా ఉండగా, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఇరువైపులా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

“ప్రస్తుత ఉద్రిక్తత కారణంగా మన ప్రజలు ప్రభావితమవుతున్నారు. అమాయక ప్రజలు చనిపోతున్నందున ఇరుపక్షాలు సంయమనం పాటించి ఉద్రిక్తతలను తగ్గించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది” అని ఆమె పేర్కొన్నారు. ఉద్రిక్తత ఇలాగే కొనసాగితే ఈ వివాదం ప్రపంచం మొత్తాన్ని ముంచెత్తుతుందని మెహబూబా ముఫ్తీ ఆందోళన వ్యక్తం చేశారు. సైనిక చర్య దేనికీ శాశ్వత పరిష్కారం కాదని. మనం ఈ సమస్యను రాజకీయాల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. ఇందులో రెండు వైపుల నుంచి ప్రజలు చనిపోతున్న విషయాన్ని 2 దేశాలు దృష్టిలో పెట్టుకోవాలన్నారు.

“జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎంతకాలం ఇలా చనిపోతూ ఉంటారు? మన పిల్లలను ఎందుకు చంపుతున్నారు. వారి రక్తం ఎందుకు చిందుతోంది?”   అంటూ మెహబూబా ముఫ్తీ కంటతడి పెట్టారు.  రెండు వైపుల నుంచి ప్రధానులు చర్చల ద్వారా దీనిని పరిష్కరించుకోవాలని సూచించారు.  “రెండు దేశాలకు అణ్వాయుధాలు ఉన్నాయి. వాటిని ప్రయోగిస్తే ఎవరూ మనుగడ సాగించలేరు” అని మెహబూబా ముఫ్తీ చెప్పారు.

Loading...
Unable to load recommendations.
Follow Us