Parliament Monsoon session: రేపటినుంచే పార్లమెంట్ సమావేశాలు.. వాటిపై నిషేధం విధించిన సెక్రటేరియట్..

|

Jul 17, 2022 | 7:21 AM

Parliament Monsoon session: రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంటే.. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి.

Parliament Monsoon session: రేపటినుంచే పార్లమెంట్ సమావేశాలు.. వాటిపై నిషేధం విధించిన సెక్రటేరియట్..
Parliament
Follow us on

Parliament Monsoon session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 18 నుంచి ఆగస్ట్ 12 వరకు ఈసారి సమావేశాలు జరుగుతాయి. ఈ మేరకు నిన్న లోక్‌సభ స్పీకర్ ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. 17వ లోక్ సభ తొమ్మిదో సెషన్ లో సభ 18 రోజులు పని చేస్తుందని, మొత్తం 108 గంటల పాటు సమావేశాలు జరుగుతాయని స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. జీరో అవర్ నోటీసులకు సమయం మార్చిన విషయాన్ని స్పీకర్ గుర్తు చేశారు. ఈ స‌మావేశాల్లో మోదీ ప్రభుత్వం 20కిపైగా బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటిలో అటవీ సంరక్షణ సవరణ బిల్లు, ఇంధన సంరక్షణ సవరణ బిల్లు, కుటుంబ న్యాయస్థాన సవరణ బిల్లులు ప్రధానమైనవి. వీటితో పాటు సంక్షేమ సవరణ బిల్లు, సహకార సంఘాల సవరణ బిల్లు, నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సవరణ బిల్లు 2022 ఈ సెషన్‌లో ప్రవేశపెట్టనున్నారు. అలాగే.. సెంట్రల్ యూనివర్శిటీల సవరణ బిల్లు 2022 కూడా ప్రవేశపెట్టబడుతుంది కేంద్రం.

కాగా.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో సభల్లో పాటించాల్సిన విధానాలు.. మాట్లాడే పదాలు వంటి పలు అంశాలపై లోక్ సభ సెక్రటేరియట్ పలు నిషేధాలను విధించింది. ఇప్పటే పార్లమెంట్ ఉభయసభల్లో వాడకూడని (అన్ పార్లమెంటరీ వర్డ్స్) పదాలు ఏమిటో వెల్లడిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన లోక్ సభ సెక్రటేరియట్.. ఇంకా మరికొన్నింటిపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంట్ ఆవరణలో ధర్నాలు, దీక్షలను కూడా నిషేధించింది. సభలో సభ్యులు ఎవరూ కూడా పాంప్లేట్లు (కరపత్రాలు), ప్లకార్డులను లోక్ సభలో ప్రదర్శించకూడదని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ ఆంక్షలపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

జులై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనున్నందున ఈ పార్లమెంట్ సమావేశాలు ప్రత్యేకం కానున్నాయి. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక జరగనుంది. మరోవైపు ఇవాళ సాయంత్రం రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు అన్ని పక్షాల నేతలతో వెంకయ్య నాయుడు భేటీ కానున్నారు. సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..